2024 లో ఏపీ సీఎం ఎవరో తేల్చేసిన వేణుస్వామి - టీడీపీ, జనసేన పొత్తు లో కొత్త ట్విస్ట్..!!
రాబోయే ఎన్నికల్లో ఏపీలో సీఎం అయ్యేది ఎవరు. తెలంగాణలో ఎవరికి అధికారం దక్కనుంది. ఈ రెండు అంశాల పైన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి తేల్చి చెప్పారు. ఏపీలో పొత్తుల చర్చ జరుగుతున్న వేళ పార్టీల మధ్య అంచనా వేస్తున్న పరిణామాలకు భిన్నంగా జరుగుతుందంటూ ఆసక్తి పెంచారు.
టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసారు. తెలంగాణలో బీజేపీ మూడో స్థానంకు పరిమితం అవుతుందని చెబుతూ..అధికారం ఎవరికనే దాని పైన ఆసక్తి కర విశ్లేషణ చెప్పుకొచ్చారు.

అధికారం ఎవరికంటే: ఏపీ, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దాని పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. దీని పైన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి తన అంచనాలను వెల్లడించారు. పార్టీల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేసారు. జగన్ తొలి స్థానంలో ఉండగా, చంద్రబాబు రెండో స్థానంలో, పవన్ కల్యాణ్ మూడో స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే యోగం జగన్ కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు.
తాను ముందుగా చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అరెస్టులు కొనసాగుతాయని వెల్లడించారు. పార్టీల కలయికలో ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక జరిగినట్లే కనిపించినా..ఏదైనా జరిగే అవకాశ ఉందంటూ వేణుస్వామికొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆ రెండు పార్టీల పొత్తు తనకు ప్రశ్నగానే ఉందని ఆసక్తిని పెంచే విశ్లేషణ చేసారు.
జగన్ ను అడ్డుకోలేరు..పొత్తు కష్టమే: ఏం జరిగినా వ్యక్తి విజయాన్ని అడ్డుకో లేరని జగన్ సీఎం అవ్వటం పై వివరించారు. సీఎం జగన్ గురించి కొంత మంది వ్యతిరేకంగా చెబుతారని..రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ద్వేషిస్తూ మాట్లాడుతారని..కానీ జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. గురు గ్రహం నీచంలో ఉండటంతో జగన్ ను తిట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని..ఓట్లు మాత్రం జగన్ కే వేస్తారని విశ్లేషించారు.
పవన్ కు జనాదరణ విపరీతంగా ఉంటుందని..కానీ, ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు..పవన్ ఒక వేళ కలిస్తే జగన్ కు టఫ్ ఫైట్ ఇస్తారని..ఓడించలేరని..ఏపీలో అధికార మార్పిడి వంటి అద్బుతాలు జరిగే అవకాశాలు లేవని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలే ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో తాను కాంగ్రెస్ కు 130-140 సీట్లు వస్తాయని చెప్పిన అంచనాలు నిజమయ్యాయని గుర్తు చేసారు.
తెలంగాణలో హోరా హోరీ: తెలంగాణ పైన ఆసక్తికర విశ్లేషణ చేసారు. తెలంగాణలో ఒకటో స్థానం కోసం బీఆర్ఎస్..కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ కు మార్పు మొదలైందన్నారు. కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని వివరించారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయని..హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని వేణుస్వామి తేల్చి చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని.. కర్ణాటకలో గతంలో జేడీఎస్..కుమారస్వామికి వచ్చిన అవకాశం ఈ సారి తెలంగాణ లో ఎంఐఎంకు వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు. కేంద్రంలోనూ ఎన్నికల నాటికి చాలా మార్పులు జరగుతాయని వేణుస్వామి వివరించారు. ఇప్పుడు వేణుస్వామి విశ్లేషణ పై రాజకీయంగా ఆసక్తి కర చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది.












Click it and Unblock the Notifications