కడప-చిత్తూరులో జలప్రళయం : 30 మంది గల్లంతు- 12 మంది మృతి : తిరుపతికి రైళ్ల రద్దు..!!
భారీ వర్షాలు రెండు జిల్లాల్లో జలప్రళయం సృష్టించాయి. కడప..చిత్తూరు జిల్లాలను ముంచెత్తాయి. తిరుపతిని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. తిరుమలలోనూ పోటెత్తింది. భారీ వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ఊళ్లను ముంచేసింది.
Recommended Video

30 మంది గల్లంతు 12 మృతదేహాలు లభ్యం
నాలుగు బస్సులు నీళ్లల్లో చిక్కుకున్నాయి. ఒక బస్సులో కండక్టరు, ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. పెద్దసంఖ్యలో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 540 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 30 మంది గల్లంతు కాగా..అందులో 12 మృతదేహాలు లభించాయి. వరదకు పింఛా ప్రాజెక్టు రింగ్బండ్ తెగిపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో అన్నమయ్య ప్రాజెక్టులోకి ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి పడింది.

కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు
దీంతో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కొట్టుకుపోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరదనీరు అతి వేగంగా దూసుకువస్తూ గ్రామాలపైకి వచ్చేసింది. ఆ గ్రామాల్లో ప్రజలు తేరుకుంటుండగానే ఇళ్లను ముంచెత్తింది. మందపల్లె గ్రామంలో శివాలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఊళ్లోకి వరద వస్తున్నట్లు తెలియడంతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు ట్రాక్టర్లో శివాలయంలోకి వెళ్లారు. వరద శివాలయాన్ని ముంచెత్తింది. పురోహితులైన అన్నదమ్ముల కుటుంబాల్లో తొమ్మిదిమంది గల్లంతయ్యారు.

నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సులు
రాజంపేట-నందలూరు మార్గంలో రామాపురం చెక్పోస్టు సమీపంలో 4 బస్సులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. వీటిలో రెండు ఆర్టీసీ బస్సులు, ఒక అద్దె బస్సు, ఒక ప్రైవేట్ బస్సు ఉన్నాయి. అద్దె బస్సు నీటి ఉధృతికి కల్వర్టులోకి కొట్టుకుపోయి కండక్టర్ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనివాసులు, లక్కిరెడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ మృతి చెందారు. మిగిలిన 3 బస్సుల డ్రైవర్లు, ప్రయాణికులు 27 మంది బస్సుల పైకి ఎక్కారు. వారిని రెస్క్యూ బృందం రక్షించింది. తిరుమల కొండల్లోంచి వచ్చిన నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది.

తిరుపతిలో 70 కాలనీలు జలదిగ్బంధం
తిరుమలలోని గోగర్భం డ్యాం, పాపనాశనం డ్యాం నిండిపోయాయి. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. కొండల్లో నుంచి దుమికే వరద నీరు తిరుపతి కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కపి లేశ్వరస్వామి ఆలయం వరద నీటితో నిండి పోయింది. ఆ వరద నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. మాల్వాడీగుండం కాలువ పొంగి ప్రవహించింది. ఫలితంగా తిరుపతి నగరంలోని సుమారు 70 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకు న్నాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తేయడంతో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. బహుదానది ప్రవాహంతో కాణిపాకం ఆలయం జలమయమైంది.

540 గ్రామాలు నీట మునక
జిల్లాలో 540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు, కర్ణాటకకు కొన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బంగారుపాళెం వద్ద నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. కొండచరియలు విరిగిపడటం, పొగమంచు కారణంగా తిరుమల ఘాట్ రోడ్లను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సమీపంలో పెన్నానదిలో చిక్కుకున్న 17 మంది మత్స్యకారులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం అర్ధరాత్రి కాపాడాయి.

ప్రధాని ఆరా..సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద చుట్టుముట్టిన కోలగట్ల గ్రామంలో ఒక భవనంలో చిక్కుకున్న 30 మందిని కూడా రక్షించారు. ముంబై-చెన్నై మార్గంలో వైఎస్సార్ జిల్లా నందలూరు రైల్వేసెక్షన్లోని హస్తవరం డిస్టింట్ సిగ్నల్ సమీపంలో డబుల్ లైన్ రైల్వే ట్రాక్ కిలోమీటరు మేర కొట్టుకుపోయింది. రైల్వే విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక, పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోవటంతో తిరుపతి మీదుగా వచ్చే..వెళ్లే రైళ్లను రద్దు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు..వరద ప్రభావం పైన ప్రధాని మోదీ సీఎం జగన్ కు ఫోన్ చేసి ఆరా తీసారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications