జగన్ సొంత వర్గానికే పెద్దపీట, మంత్రులెవరైనా షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు సంచలనం
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై అధికార పార్టీలోని కొందరు నిరసనలు తెలుపుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ సామాజిక న్యాయం పాటించలేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక న్యాయం అంటే తెలియదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
జగన్ శ్రద్ధ సొంతవర్గంపైనే..
వైఎస్ జగన్ తన సొంత వర్గానికి న్యాయం చేసుకోవడంపై చూపిన శ్రద్ధ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై ఏనాడూ చూపింది దేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడమేనా? మీరు చేసిన సామాజిక న్యాయం.? అని ప్రశ్నించారు. వేలాది మంది బడుగు, బలహీన వర్గాల మీద కేసులు పెట్టి, బెదిరింపులు, వేదింపులు, హత్యలు, అవమానాలకు గురి చేయడమేనా మీరు సాధించిన సామాజిక న్యాయం.? అని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో దళిత మంత్రి నారాయణస్వామికి కుర్చీ కూడా ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అవమానించి.. ఆయనను కన్నీటి పర్యంతం చేయడం సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దళిత, మహిళా హోం మంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డిని షాడో మినిస్టర్గా నియమించి హోం మంత్రిని డమ్మీని చేయడం సామాజిక న్యాయమా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్తరాంధ్రకు సామంతరాజుగా మీ అవినీతి భాగస్వామి, ఏ2 విజయసాయిరెడ్డి నియమించి.. అక్కడి మంత్రులు, ఎమ్మల్యేలను డమ్మీలను చేయడం సామాజిక న్యాయమా.? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.
మంత్రులెవరైనా నడిపించేది ఆ షాడోలే: అచ్చెన్నాయుడు సంచలనం
బీసీలు ఛైర్మన్లుగా నియమించబడిన తిరుపతి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహా.. ఇతర మున్సిపాలిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లన్నింటికీ సొంత సామాజిక వర్గాన్ని షాడోలుగా నియమించడమే సామాజిక న్యాయమా.? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.జగన్ రెడ్డి తన అవినీతిని విస్తరించుకునేందుకు తప్ప.. బలహీనవర్గాలకు కేబినెట్ విస్తరణతో ఒరిగేదేమీ లేదన్నారు. దొంగ కంపెనీలు, తప్పుడు లెక్కలు, మోసపు మాటలు చెప్పడం వైసీపీ నేతలకు జె-బ్రాండ్స్ తో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కేబినెట్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించామని చెబుతున్న జగన్ రెడ్డి.. ఏ ఒక్కరినైనా స్వతంత్రంగా పని చేసే వీలు కల్పించారా.? అని ప్రశ్నించారు. ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకి, ఛైర్మన్లు, ఇంఛార్జులు అందరికీ రెడ్లను షాడోలుగా నియమించి వారిని వెన్నెముక లేని వారిగా చేయడమేనా మీరు చేసిన సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ఒకవైపు షాడోలతో డమ్మీలను చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలకు కేబినెట్లో 70 శాతం అవకాశాలిచ్చామని చెప్పడం ద్రోహం కాదా.? బడుగు, బలహీన వర్గాలను ముందు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి రాజ్యాంగేతర శక్తులను షాడో మినిస్టర్లుగా ప్రోత్సహించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమానించడం కాదా.? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. టీడీపీ హయాంలో ఎవరికీ కేటాయించిన శాఖను వారే నిర్వహించేవారన్నారు. సామాజిక న్యాయంపై చర్చకు సీఎం జగన్ రెడ్డి సిద్ధమా? అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
అన్ని పోస్టులు ఆ వర్గానికేనా..: అచ్చెన్నాయుడు నిలదీత
ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, కోస్తాలో సజ్జల రామకృష్ణారెడ్డి, రాయలసీమలో వైవీ సుబ్బారెడ్డిని ఇంఛార్జులగా నియమించి.. అన్ని వర్గాలకు చెందిన ప్రజాప్రతినిదుల్ని డమ్మీలుగా పెట్టి.. వారి వారి వెనక రెడ్లతో వసూళ్ల కౌంటర్లు పెట్టారంటూ అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవిని రెండు సార్లు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం ఏం సామాజిక న్యాయం.? గత ప్రభుత్వ హాయాంలో ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిలో బీసీని నియమిస్తే మీరు రెడ్లకు కట్టబెట్టారు. తుడా చైర్మన్ సైతం రెడ్లకే కట్టబెట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీల వాటా ఎంత? సలహాదారుల్లో అధిక భాగం ఎవరికిచ్చారు? నామినేటెడ్ పదవులు, ఉద్యోగాల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను అణగదొక్కడం కాదా.? మూడేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో తీవ్రమైన ద్రోహం చేసి.. వారి వ్యతిరేకత నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు పదవుల పేరుతో రాజకీయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. మూడేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఏం బాగుపడ్డాయో చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా.? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ వర్గమైనా జగన్ రెడ్డి అమలు చేశానంటున్న సామాజిక న్యాయంతో బాగుపడినట్లు చూపగలరా.? బడుగు బలహీన వర్గాల విషయంలో ఎన్నిరకాల కుప్పి గంతులేసినా, తిమ్మిని బమ్మిని చేసేలా ఎంత ప్రచారం హోరెత్తించినా.. వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు కర్రు కాల్చి జగన్ రెడ్డికి వాతలు పెట్టడం తథ్యమని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు హెచ్చరించారు.