వైసీపీ నేతలవి నీఛ రాజకీయాలు.. చేతగాని మీరు మాపై విమర్శలా: అచ్చెన్నాయుడు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాష్ట్రంలో జరిగే ఏ పరిణామం అయినా రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీస్తుంది. ఇక తాజాగా విజయవాడలో 9వ తరగతి చదువుతున్న బాలిక టిడిపి నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
ఆడపిల్లలలపై అఘాయిత్యాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవటం సిగ్గుచేటు
ఇక ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సిగ్గుచేటని వైసిపి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని, అందుకే నిందితుడు వినోద్ జైన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు అంతే లేకుండా పోతుందని మండిపడ్డారు.
ఆడబిడ్డలకు అండగా నిలవడం చేతగాని మీరు మా పై విమర్శలా
తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించటం అధికార పార్టీ నేతల నీచమైన చర్య అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తమకు విషయం తెలిసిన వెంటనే నిందితుడిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అచ్చెన్న. పార్టీ నుండి సస్పెండ్ చేశామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు పరామర్శించారు అని ఆడబిడ్డలకు అండగా నిలవడం చేతగాని మీరు మా పై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని వైసిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
కాలకేయుల మాదిరిగా వైసీపీ నేతలు ఆడపిల్లలపై అఘాయిత్యాలు
సీఎం చేతగానితనం మహిళల పాలిట శాపంగా మారిందని, కాలకేయుల మాదిరిగా వైసీపీ నేతలు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న అచ్చెన్నాయుడు కనీసం ఒక్క కిరాతకుడుపైన కూడా రెండున్నర సంవత్సరాలలో చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఇంటి నుండి బయటకు రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆయన పేర్కొన్నారు. బాలిక జీవితాన్ని చిదిమేసిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ నేత భూ శంకరరావును దిశా చట్టం కింద ఎందుకు ఉరితీయలేదో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
నేరస్థులకు అండగా నిలుస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు
ఇక ఇదే సమయంలో విశాఖ జిల్లాలో ఓ బాలికను ఓ కామాంధుడు అత్యాచారం చేస్తే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడిని శిక్షించక పోవడంతో మనస్తాపం చెందిన బాలిక తండ్రి ఆత్మహత్య యత్నం చేయడం దేనికి సంకేతమో చెప్పాలని వైసిపి సర్కార్ ను ప్రశ్నించారు. నేరస్థులకు అండగా నిలుస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారని పేర్కొన్న అచ్చెన్నాయుడు దిశ చట్టం కింద మీరు నిందితులకు ఉరి వేయరు అని తెలుసుకున్న బాధితులే ప్రభుత్వ అసమర్థత వల్లే ఉరివేసు కుంటున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా అంటూ ప్రశ్నించారు.
Recommended Video
మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్
గడిచిన రెండున్నరేళ్ళు మహిళలు, చిన్నారులు, వృద్ధులపై జరిగిన దారుణాలు ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికైనా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని, అభం, శుభం తెలియని చిన్నారులు జీవితాలను నాశనం చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అంతేకాదు ఊరికి ఒకరున్న భూ శంకర్రావు లాంటి వాళ్ళను శిక్షించాలని డిమాండ్ చేశారు.