కాకినాడలో దారుణం: కత్తులతో దాడులు, ముగ్గురు మృతి
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాతకక్షలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులను బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీపావళి పండగను అంతా సంబరంగా జరుపుకుంటున్న వేళ ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బైక్పై బాణాసంచా తీసుకెళ్తుండగా పేలుడు: ఒకరు మృతి
దీపావళి పండగవేళ ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం గుంతలో పడటంతో బండి అదుపుతప్పింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరులోని తూర్పు వీధిలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సుధాకర్ అనే వ్యక్తి బైక్పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్పై నుంచి బస్తా కిందపడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తోన్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు ఊపిరాడక అందులోని మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications