జగన్ పార్టీ సిఎస్గా విజయసాయిరెడ్డి: కొణతాల మిస్!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తొలి విడతగా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులను నియమించారు. జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకు ఆడిట్ బాధ్యతలు నిర్వర్తించిన విజయ సాయిరెడ్డికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
కాగా, ఈ జాబితాలో తొలి నుంచి పార్టీకి సేవలందిస్తూ వచ్చిన పలువురు నేతలకు జగన్ షాక్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి నేత దాడి వీరభద్రరావు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కొణతాల రామకృష్ణకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జాబితాలో మైసూరా రెడ్డి మినహా పాత కాపులెవరికీ చోటు దక్కలేదు.
ప్రధాన కార్యదర్శుల జాబితాలో తొలి వరుసలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పేరును వైయస్ జగన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తనదైన రాజకీయ ముద్రను వేసుకున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును కూడా ప్రధాన కార్యదర్శుల జాబితాలో చేర్చారు. మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు కూడా ప్రధాన కార్యదర్శుల జాబితాలో చోటు లభించింది. వీరితోపాటు జంగా కృష్ణమూర్తి, భూమన కరుణాకర రెడ్డి, పిఎస్వి ప్రసాద్లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
కాగా, తనకు అత్యంత సన్నిహితంగా ఉండే జ్యోతుల నెహ్రూను తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పదవికే జగన్ పరిమితం చేశారు. కొడాలి నానీకి కృష్ణా(ఉత్తర) అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతిని నియమించారు. విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతలను కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించారు.
విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవిని అమర్నాథ్కు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని ఆళ్ల నానీకి అప్పగించారు. మాజీ మంత్రి కె పార్థసారథికి కృష్ణా(దక్షిణ) అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. గుంటూరు జిల్లాకు అధ్యక్షునిగా మర్రి రాజశేఖర్, ప్రకాశంకు బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కడపకు అమర్నాథ రెడ్డి, అనంతపురంకు శంకర నారాయణ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నారాయణ స్వామిని నియమించారు.