అరబిందో ఫార్మా, రాజకీయం... కవల పిల్లలు?
అరబిందో ఫార్మా అంటేనే దేశవ్యాప్తంగానేకాదు.. అంతర్జాతీయంగా మంచిపేరు. 35 సంవత్సరాల క్రితం ఒక ఆశయం కోసం, లక్ష్యం కోసం ప్రారంభమైన సంస్థలో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. ఏడాది క్రితం కంపెనీ షేరు ధర రూ.900గా ఉండేది. ఇప్పుడు మాత్రం రూ.470 దగ్గర ఆగింది. సంవత్సర కాలం నుంచి కంపెనీ షేర్ ధర నేలచూపులు చూడటానికి కారణం ఏమిటి? సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,669 కోట్ల రూపాయలున్న సమయంలో ఈనెల పదోతేదీన మూడున్నర వేల కోట్లరూపాయల క్యాపిటలైజేషన్ ను కోల్పోవడానికి సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడమే దీనికి కారణం. ప్రస్తుతం షేర్ ధర రూ.488 దగ్గర నిలిచింది.
ఫార్మా కంపెనీల్లో దిగ్గజ కంపెనీగా..
నిత్యానందరెడ్డి, పెనాక రామ్ ప్రసాద్ రెడ్డి 35 సంవత్సరాల క్రితం అరబిందో ఫార్మాను ప్రారంభించారు. కాలక్రమంలో ఫార్మా కంపెనీల్లో దిగ్గజంగా నిలిచింది. 100 దేశాలకు ఎగుమతులున్నాయి. కానీ ఇటీవలి కాలం నుంచి సంస్థకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పెనాక రామప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శరత్ చంద్రారెడ్డి సంస్థ వ్యవస్థాపకుడైన నిత్యానందరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. మరో కుమారుడు రోహిత్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెను మనువాడారు.
తరిగిపోతున్న మంచి పేరు?
దివంగత వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో అరబిందో కంపెనీ ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలను పొందింది. అయితే అవన్నీ కంపెనీకి చెడ్డపేరు తీసుకురావడంతో పాటు డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కేసుల విషయంలో వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అకస్మాత్తుగా అరెస్ట్ అయ్యారు. దీంతో కంపెనీ షేరు మరోసారి నేలచూపులు చూసింది. అద్భుతమైన ట్రాక్ రికార్డు అరబిందో సొంతం. అయితే కంపెనీకున్న మంచిపేరు రోజురోజుకు తగ్గిపోతూ వస్తోంది.
వేలమంది ఉద్యోగుల కోసం ఆలోచించాలి!
తెలుగు రాష్ట్రాల్లో అరబిందోతోపాటు రెడ్డీస్ ల్యాబ్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఉంది. అయితే ఆ సంస్థ పై ఒక్క రిమార్కు కూడా లేదు. అరబిందోకు కూడా అటువంటి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగడంవల్ల మొదటికే మోసం తెచ్చుకుంటోంది. వేల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావడంతో యాజమాన్యం కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరెన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, గొప్ప తెలుగు దిగ్గజ కంపెనీని కాపాడుకోవడానికి యాజమాన్యం, ఉద్యోగులు కలిసికట్టుగా కృషిచేయాలనే సూచనలు అందుతున్నాయి. రాజకీయం, వ్యాపారం అనేవి నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. రాజకీయాల జోలికి వెళ్లకుండా, రాజకీయ నాయకులతో స్నేహం లేకుండా కంపెనీపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే పునాదులు మరింత పటిష్టమవుతాయని భావిస్తున్నారు.