అఖిలకు అహంకారం, ‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి
అమరావతి: ఏపీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.
Recommended Video
ఆళ్లగడ్డలో సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
రాళ్లదాడి ఆధారాలు
ఈ నేపథ్యంలో అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. అయితే అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ అఖిలప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. దీంతో ఆళ్లగడ్డ పంచాయితీ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు అధిష్టానం పిలుపుమేరకు ఇక్కడికి వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి ..అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తనపై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు అందచేశారు.
రాళ్లదాడా? భయపడేది లేదు?
ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాళ్లదాడులు సరికాదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాడికి సంబంధించిన ఆధారాల్నీ ముఖ్యమంత్రికి అందచేస్తా. పార్టీ ఆదేశాల మేరకే సైకిల్ ర్యాలీ చేశాను. రాజకీయంగా వారికి అడ్డు వస్తున్నాననే నాపై దాడులు చేస్తున్నారు. రాళ్లదాడి చెత్త. ఇలాంటివి చాలానే చూశాను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఏవీ సుబ్బారెడ్డి అంటే భయం, భక్తి లేదు. కనీసం వయస్సుకు కూడా పెద్దరికం ఇవ్వలేదు. ప్రత్యర్థులు కూడా నాపై దాడి చేయడానికి సాహసం చేయరు. అలాంటిది ఆమె నాపైనే దాడి చేయిస్తుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఖిలప్రియకు అహంకారం పెరిగింది.. భయపడుతోంది
‘ అఖిలప్రియకు అహంకారం పెరిగింది. నా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు స్పందించాలి కదా. మంత్రి సైకిల్ ర్యాలీ కంటే నాకే ఎక్కువ ఆదరణ లభించింది. నా ఆధ్వర్యంలోనే వైసీపీ నుంచి చేరికలు జరిగాయి. అఖిలప్రియ తన గ్రాఫ్ పడిపోతోందని భయపడుతోంది. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. అలాంటిది ఆమె గురించి మాట్లాడాలంటే నా పెద్దిరికం అడ్డు వస్తోంది. అందుకే నా తరఫున నా కూతురు మాట్లాడింది' అని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.
భూమా కుటుంబంతో సంబంధాలు తెగినట్లే..
‘నాపై రాళ్లదాడి జరిగిన నేపథ్యంలో భూమా కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే రాజకీయపరంగా అధిష్టానం చెబితే రాజకీయంగా సహకరిస్తా. ఇక వ్యక్తిగతంగా వస్తే భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధానికి తెరపడినట్లే. సీఎంతో సమావేశానికి అఖిల ఎందుకు రాలేదో అర్థం కాలేదు. గురువారం సాయింత్రం సీఎంతో సమావేశం అవుతున్నాం' అని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.