ఎవడండీ గంటా - లక్షల్లో వాడొక్కడు : అయ్యన్న సంచలనం..!!
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యే గంటాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎవడండీ గంటా అంటూ ప్రశ్నించారు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారంటూ ఆరోపించారు. విశాఖ జిల్లా లో 2014 నుంచి ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉంది. ఇద్దరు చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా ఉన్నా..ఎవరి రాజకీయం వారిదే. ఇప్పుడు తిరిగి ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ గంటాను ఉద్దేశించి అయ్యన్న చేసిన వ్యాఖ్యలు టీడీపీ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో సారి గంటా పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీకి దూరంగా ఉంటూ..తిరిగి గంటా టీడీపీలోనే కొనసాగుతానంటూ స్పష్టత ఇచ్చారు. ఈ సమయంలో అయ్యన్న నేరుగా గంటా పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంటాను ఉద్దేశించి.. ఎవడండీ గంటా.. లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..ప్రధానా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో కూడా పని చేయాలనేదే తమ కోరికగా చెప్పుకొచ్చారు. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలని పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎక్కడో దాక్కొని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారంటూ గంటాను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండని వారి పైన తమకు బాధ కలుగుతుందని చెప్పుకొచ్చారు.
పార్టీకి అందరూ కావాలని అయ్యన్న పేర్కొన్నారు. టీడీపీకి తొలి నుంచి బీసీలు అండగా ఉన్నారని అయ్యన్న గుర్తు చేసారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసిందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారని వివరించారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం తో పాటుగా మూడు ప్రాంతాల్లోనూ బీసీ సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. తనకు హోం శాఖ ఇస్తే ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో వారిని గుర్తు పెట్టుకొని ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు విశాఖ టీడీపీలో మరోసారి తాజాగా అయ్యన్న వ్యాఖ్యలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది.