ఎన్టీఆర్ ఆత్మను చంపి.., బాబే డెవలపయ్యారు: కెటిఆర్
రాజకీయాల్లోకి రాకముందు రెండెకరాల భూమి ఉన్న బాబుకు ఇప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా 15 ఎకరాల ఫాం హౌస్ ఉందని విమర్శించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు సమైక్యవాదులు కాదని అవకాశవాదులను మండిపడ్డారు. సీమాంధ్రుల సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
తెలంగాణ వచ్చాక హైదరాబాదును ఐటి రాజధానిగా చేస్తామని కెటిఆర్ చెప్పారు. హైదరాబాదు వల్లనే బాబు డెవలప్ అయ్యారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశాలు చాయ్, బిస్కట్ మీటింగులేనని ఎద్దేవా చేశారు. ఎపిఎన్జీవోల సభలో కానిస్టేబుల్ జై తెలంగాణ అంటే తప్పు కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర అంటే తప్పు కాదా అని ప్రశ్నించారు.
ఉద్యోగులకు సెల్యూట్: టిజి వెంకటేష్
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు తాను సెల్యూట్ చేస్తున్నానని మంత్రి టిజి వెంకటేష్ కర్నూలులో అన్నారు. ఆయనను కర్నూలులో సమైక్యవాదులు అడ్డుకొని, కాన్వాయ్ పైకి చెప్పులు విసరడం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘం ఐకాస నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
అసెంబ్లీలో సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపించేందుకే తాము పదవుల్లో ఉన్నామన్నారు. లక్షమంది వ్యాపారులతో త్వరలో హైదరాబాదు లేదా ఢిల్లీలో ఆందోళన చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే విభజన ఆగుతుందన్నారు. కొందరు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.