Vande Mataram: అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష. జాతీయ గేయానికి చట్టబద్ధమైన పవర్స్!
భారత స్వాతంత్ర్య సమరంలో కోట్లాది మందిలో దేశభక్తిని రగిలించిన అమర గేయం 'వందేమాతరం'కు ఇకపై చట్టబద్ధమైన గట్టి రక్షణ లభించనుంది. భారత జాతీయ గీతమైన 'జనగణమన'కు ప్రస్తుతం చట్టపరంగా ఉన్న గౌరవ మర్యాదలు, రక్షణలన్నింటినీ వందేమాతరం గేయానికి కూడా వర్తింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 1971 నాటి 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం'కు కీలక సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గేయాన్ని అవమానించినా లేదా దాన్ని ఆలపించేటప్పుడు అడ్డుతగిలి అలజడి సృష్టించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
పార్లమెంట్ వేదికగా చారిత్రక అడుగు
రానున్న జూలై 20 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సరికొత్త సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ బిల్లు గనుక ఉభయ సభల ఆమోదం పొంది చట్టంగా మారితే, భారత న్యాయ చరిత్రలో వందేమాతరం గేయానికి ప్రత్యక్ష చట్టబద్ధమైన రక్షణ లభించడం ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 1971 నాటి చట్టం కేవలం భారత జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతం (జనగణమన)లకు మాత్రమే చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు ఆ పరిధిని మరింత విస్తృతం చేస్తూ వందేమాతరాన్ని కూడా ఇందులో చేర్చనున్నారు.

శిక్షల వివరాలు ఇవే..
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. ఎవరైనా జాతీయ గీతాన్ని ఆలపించకుండా అడ్డుకున్నా, పాడే సమయంలో కావాలని గందరగోళం సృష్టించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే ఈ రెండూ విధించే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకురాబోతున్న కొత్త సవరణ ద్వారా ఇదే శిక్షా నిబంధనలను వందేమాతరం గేయానికి కూడా వర్తింపజేయనున్నారు. అయితే ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చాలంటే ముందుగా పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభలలో సుదీర్ఘ చర్చలు జరిగి, ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం కావాల్సి ఉంటుంది.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నిర్ణయం
గతంలో సెక్యులరిజం పేరుతో పాలించిన ప్రభుత్వాలు వందేమాతరం గేయానికి ఇవ్వాల్సిన అసలైన గుర్తింపును ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ దీర్ఘకాలంగా వాదిస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటంతో ఈ గేయానికి ఎంతో చారిత్రక అనుబంధం ఉన్నప్పటికీ, కొన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా గత పాలకులు దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రస్తుత పాలక వర్గం భావిస్తోంది. ఇటీవలి కాలంలో కొన్ని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, కొన్ని ప్రత్యేక వర్గాల కార్యక్రమాల్లో వందేమాతరం గేయానికి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లులో 'అవమానం' అనే పదాన్ని ఏ విధంగా నిర్వచిస్తారనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications