రాజధాని పేరుపై టీడీపీలో..: బాలకృష్ణ ప్రపోజల్, అమరావతికి గోరంట్ల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆ పార్టీలోనే ఒక్కోరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెబుతున్నారు. గురువారం నాడు శాసన సభ లాబీల్లో రాజధాని, హిందూపురం జిల్లాగా చేస్తే పేరు పెట్టే అంశంపై బాలకృష్ణ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, అనంత నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి ఇంకా పునాది రాయి పడలేదు. రాజధాని నిర్మాణ బాధ్యతలకు సంబంధించిన రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ బిల్లు శాసనసభలో ఆమోదం పొందలేదు. అయితే రాజధానికి పేరు విషయంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొంతమంది అమరావతి బాగుంటుందని చెప్పగా, ఇంకొంతమంది ఎన్టీఆర్ పేరు పెడితే అద్భుతంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి తాను పూర్తిగా అమరావతి పేరుకే మొగ్గు చూపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే తనకు ప్రాణమని, అయితే రాజధానికి మాత్రం అమరావతి పేరు పెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

బౌద్ధుల రాజధానిగా ఉన్న అమరావతి పేరును రాష్ట్ర రాజధానికి పెడితే ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని పేరుకు రిథమ్, రైమ్ రెండు ఉండాలన్నారు. ఎన్టీఆర్ నగర్ అన్నది అంత రిథమిక్గా లేదని చెప్పారు. తారక రామనగర్ అంటే కూడా బాగుంటుందేమోనని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని గోరంట్ల చెప్పారు. ఇదే సమయంలో రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వ్యక్తం చేశారు. ఆయన లాబీల్లో పల్లె, అనంత నేతలతో మాట్లాడారు. అనంతపురం జిల్లాకు చెందిన నేతలతో భేటీ అయిన బాలకృష్ణ హిందూపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు.
కొత్త రాష్ట్ర రాజధానికి ఎన్టీఆర్ పేరు ఖరారుచేస్తే హిందూపురానికి మరో పేరు పెట్టే అంశాన్ని పరిశీలిద్దామన్నారు. హిందూపురం జిల్లాకు ఏం పేరు పెట్టాలన్నది మీరు, నేను, ఎంపీ నిమ్మల కిష్టప్ప కలిసి మాట్లాడుకుందామని బాలకృష్ణ అనంతపురం నేతలతో చెప్పారు.
మరికొంతమంది సభ్యులు కూడా రాష్ట్ర రాజధాని అంశంపై స్పందిస్తూ వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాత కొత్త రాజధానికి వెళ్లిపోయి షెడ్లు వేసుకునైనా కాలం వెళ్లదీయాలన్న భావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ, పాలన మాత్రం 13 జిల్లాల రాష్ట్ర రాజధాని నుంచే కొనసాగించాలన్నారు.












Click it and Unblock the Notifications