బాలయ్య అమాయకుడు- మీ సోదరి ప్రస్తావన అసలు రాలేదు : సీఎంకు దేవుడే అండగా నిలవాలి- పేర్ని నాని..!!
ఏపీ రాజకీయాల్లో శుక్రవారం ఒక బ్లాక్ డే అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ఇంతలా దిగజారుతారు..ఇంతలా అబద్దాలు మాట్లాడటం కంటే దౌర్భాగ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీలో వ్యవసాయం పైన చర్చ జరుగుతున్న సమయంలో పక్కదారి పట్టించేందుకు టీడీపీ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించిందని మంత్రి చెప్పుకొచ్చారు. సభలో అసలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి ప్రస్తావనే రాలేదని పేర్ని నాని స్పష్టం చేసారు. నందమూరి బాలక్రిష్ణ..నందమూరి కుటుంబం చంద్రబాబు కన్నీటి వ్యవహారం పైన స్పందించటంతో దాని మీద మంత్రి రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు మాటలు నమ్మవద్దు
బాలయ్య అమాయకడుని.. చంద్రబాబు చెప్పిన మాటలు నిజమని భావించటం బాధాకరమన్నారు. వారికి జన్మనిచ్చిన ఎన్టీఆర్ గురించే చంద్రబాబు వారి బుర్రల్లో విషం ఎక్కించిన నేర్పరి అంటూ వ్యాఖ్యానించారు. అటువంటి చంద్రబాబు ..అనని మాటలు అన్నారంటూ వారికి చెప్పటం చిన్న విషయంగా పేర్కొన్నారు. పురందేశ్వరి ట్వీట్ చేసారని... చంద్రబాబు చెప్పింది నమ్మవద్దని మంత్రి పేర్ని నాని సూచించారు. భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని మంత్రి స్పష్టం చేసారు.
భువనేశ్వరి పస్తావనే సభలో రాలేదు
శాసన సభ్యులు ఏదో అన్నారని క్రియేట్ చేయటం..నమ్మించటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయంగా ఏ స్థాయికి దిగజారారో అర్దం అవుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ప్రస్తావన రాలేదన్నారు. అందరికీ భార్యలు..తల్లి..సోదరి ఉన్నారని..ఎవరూ అనుచితంగా మాట్లాడరని చెప్పుకొచ్చారు. జరగని విషయాన్ని రాజకీయంగా వాడుకోవటం సరికాదన్నారు. చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ అంతా ఓ డ్రామాగా అభివర్ణించారు. రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవాలని సూచించారు.
వీడియో ఫుటేజ్ చూసుకోవచ్చు
కావాలంటే..అసెంబ్లీలో శుక్రవారం నాటి మొత్తం వీడియో ఫుటేజ్ చూసుకోవాలన్నారు. సభలో సీఎం లేకపోయినా.. ఆయన గురించి చంద్రబాబు మాట్లాడారన్నారు. బాబాయ్ హత్య...గొడ్డలి..తల్లి..చెల్లి గురించి చర్చిద్దామని అన్నది చంద్రబాబు కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. టీడీపీ నిరసనలకు పిలుపు ఇస్తోందని..ఎందుకు నిరసనలు..ఎవరు అన్నారు..ఏమన్నారని ఈ నిరసనలని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులకు మద్దతుగా నిర్వహించిన బంద్ కు ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దని మంత్రి సూచించారు.
జగన్ కు దేవుడే అండగా నిలవాలి
ఆయన రాజకీయంగా పాతాళం లోకి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల పోరాటం లో విజయం సాధించినందుకు ఈ సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయటంలో మొనగాడన్నారు. దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, జగన్ కు దేవుడే అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడే సంప్రదాయం తెచ్చింది చంద్రబాబు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.