ఏపీలో ఉత్సవాలకు రావాలంటూ తెలంగాణ మంత్రికి బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్: ఏపీలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలను కోసం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ను కలిశారు. సచివాలయంలోని మంత్రి చాంబర్కు విచ్చేసిన బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలకు రావాలంటూ స్వయంగా అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు.
అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. ఏపీలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేపాక్షిని ఏపీలో అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఫిబ్రవరి 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని బాలకృష్ణ చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామన్నారు. లేపాక్షి ఉత్సవాలకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
బాలకృష్ణ ఆహ్వానాన్ని అందుకున్న తెలంగాణ మంత్రి చందూలాల్ స్పందిస్తూ బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేపాక్షి ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. సుమారు అరగంట సేపు సచివాలయంలో ఉత్సవాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు.
లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవానికి తనతో పాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరవుతారని చందూలాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోని లేపాక్షి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఈ లేపాక్షి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.