త్వరలో బాలకృష్ణ టీవీ ఛానల్ : జూ ఎన్టీఆర్- చిరంజీవి సినిమాలు వస్తున్నాయి : ప్రభుత్వం సహకరించాలి..!!
ప్రముఖ సినీ నటుడు..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ రేంజ్ లో నిర్వహించారు. ఈవెంట్ లో ముఖ్య అతిధిలుగా హాజరైన కుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమక్షంలో బాలయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. కార్తీకమాసం కాబట్టి అందరికీ ఆ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరుకున్న ఆయన మన ప్రతి మాట వెనుక ఒక పవర్ ఉంటుందని అన్నారు.

త్వరలోనే ఓ భక్తి టీవీ స్టార్ట్ చేద్దామని
నవరసల్లాగే పూజలు కూడా మన పూజా విధానాలు కూడా తొమ్మిది రకాలని చెబుతూ ఉంటారు మన భక్తి టీవీల్లో. ఇక ఆహా లాగే నేను కూడా త్వరలోనే ఓ భక్తి టీవీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానంటూ బాలయ్య ప్రకటించారు. ఆయన ఈ విషయం చెప్పేటప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, అల్లు అర్జున్ ని ఇచ్చిన స్మైల్ వెనుక అనేక అర్ధాలు ఉన్నాయనే విశ్లేషణలు అప్పుడే సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

వాళ్లిద్దరూ నా తమ్ముళ్లు లాంటి వారు
అల్లు రామలింగయ్య ..అల్లు అరవింద్ తో తనకు చనువు ఉందని చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ కి అల్లు రామలింగయ్య ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు. భక్తిని ఈ సినిమా బ్రతికించిందని బాలయ్య పేర్కొన్నారు. ఇక ముందు వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తానని... నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమని బాలయ్య తెలిపారు. తనకు అల్లు అర్జున్, శ్రీకాంత్ తమ్ముళ్ల లాంటి వాళ్లని చెప్పుకొచ్చారు.

చిరంజీవి..జూ ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి
ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న సినిమా టిక్కెట్లకు ఒకటే ధర అమలు పైన ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. కరోనా సమయంలో కొంతమంది ప్రాణాలకు తెగించి షూటింగులు జరిపారని... వాళ్లు ఏం చేసినా సినిమా కోసమే చేశారని బాలయ్య వ్యాఖ్యానించారు. కష్టకాలంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని బాలయ్య కోరారు. రానున్న కాలంలో పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయని... తమ్ముడు నటించిన పుష్ప, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్నాయని... ఈ సినిమాలు మంచిగా ఆడేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నానని బాలయ్య ఆకాంక్షించారు.

ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సహకరించాలి
వచ్చే నెలలో విడుదల కానున్న తన సినిమా గురించి కాకుండా.. బాలయ్య తన ప్రసంగంలో బన్నీ..తారక్..మెగాస్టార్ సినిమాల గురించి ప్రస్తావించి.. ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇప్పటికే ఇదే అంశం పైన చిరంజీవి సైతం ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. పలువురు నిర్మాతలు సైతం ఇదే అంశం పైన ప్రభుత్వానికి సూచనలు చేసారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఈ అంశాల పైన తాను ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని..వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక, సంక్రాంతికి ప్రముఖ హీరోల సినిమాలు రేసులో ఉన్నాయి. ఆ సినిమా విడుదల సమయంలోగా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వారి నుంచి వ్యక్తం అవుతోంది. మరి..జగన్ ప్రభుత్వం ఈ సినిమాల ను పరిగణలోకి తీసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications