ఓటు తూటాతో జగన్ పార్టీకి బుద్ధి చెప్పండి: శిల్పాపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
నంద్యాల ఉప ఎన్నికలో ఓటు అనే తూటాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో ఓటు అనే తూటాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలోని వెంకటేశ్వరపురంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. దీంతో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
శిల్పా చక్రపాణిపై తీవ్ర వ్యాఖ్యలు
మంత్రి భూమా అఖిలప్రియ, భూమా రెండో కూతురు మౌనిక, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిలతో కలిసి బాలకృష్ణ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ చేస్తామంటే శిల్పా చక్రపాణికి పదవులిచ్చి ఆదరించామని అన్నారు. శిల్పా చక్రపాణి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకమని తీవ్రంగా స్పందించారు.
Recommended Video
నటుడినే కాదు.. ప్రజాసేవకుడిని..
నంద్యాల ఉప ఎన్నిక నీతికి అవినీతికి, న్యాయానికి, అన్యాయానికి జరుతున్న పోరాటమని బాలకృష్ణ అన్నారు. టీడీపీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. తాను నటుడినే కాదు.. ప్రేజా సేవకుడిని కూడా అని ఆయన తెలిపారు. కర్నూలు ప్రజలు పీవీని గెలిపించి ప్రధానిని చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు.
బాలకృష్ణ డైలాగు.. అభిమానుల హోరు..
అఖిలప్రియ టీడీపీలోకి రావడంతో మంత్రి పదవి ఇచ్చి ఆదరించామని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్ని కులాలను వివరిస్తూ ఓ డైలాగును బాలకృష్ణ చెప్పారు. దీంతో అభిమానులు బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.
బ్రహ్మానందరెడ్డి గెలిపించండి..
నంద్యాలలో అభివృద్ధి జరగాలంటే టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని బాలకృష్ణ అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు కూడా ప్రజలకు సేవ చేశానని చెప్పారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా పేదలకు ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి గత వైభవం తెచ్చేందుకు నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని సైకిల్ గుర్తుకు ఓటేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాగా, వెంకటేశ్వరపురం నుంచి నంద్యాల టౌన్, గోస్పాడు, నంద్యాల రూరల్ ప్రాంతాల్లో బాలయ్య ప్రచారం కొనసాగనుంది.
చెప్పేవి హంస మాటలు.. చేసేది కోతి చేష్టలు
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బాలయ్య.. వారు చెప్పేది హంస మాటలని, చేసేది కోతి చేష్టలని అన్నారు. ఓటర్లు జాగ్రత్తగా ఉంచాలని, వారి ఉచ్చులో పడవద్దని కోరారు. నంద్యాల నేత బూమా నాగిరెడ్డి బిడ్డలు కష్టాల్లో ఉన్నారని, వారికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల్లో భూమా వారసుడైన బ్రహ్మానందరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు.