నాకు ఏదైనా జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం?
నాకు ఏదైనా జరిగితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైంది. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా నెలరోజుల క్రితం అల్లూరు వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ మహిళ రైతు సమస్యలపై ప్రశ్నించింది. అప్పటి నుంచి కవితకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఇంటి గేటుకు తాళం వేశారు
సమస్యలపై గట్టిగా ప్రశ్నించినందుకు బాలినేని అనుచరులు ఆమె ఇంటిగేటుకు తాళం వేశారు. ''ప్రశ్నించానని విద్యుత్తు సరఫరా నిలిపివేసి మంచినీరు రాకుండా చేశారు.. ఇంటికి పాలు రానివ్వకుండా అడ్డుకున్నారు.. జగనన్నా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? గతంలో ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరిగిందా? ఎక్కడైనా ఇలా జరుగుతుందా? నాకేదైనా జరిగితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటూ'' కవితకు చెందిన వీడియో శనివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు బాలినేనికే వంత పాడుతున్నారు?
''రైతు సమస్యలపై ప్రశ్నించినందుకే ఇలా ఇంటిగేటుకు తాళం వేసి బంధిస్తే ఎలా జీవిస్తాం.. పోలీసులు, నాయకులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికే వంత పాడుతున్నారు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.. ఒక ఆడపిల్లకు భద్రత లేకుండా ఎక్కడ జీవించాలో మీరే చెప్పండి జగనన్నా? నాకేమైనా అయితే బాలినేని వందశాతం బాధ్యుడు.. నేను ఎన్నిరోజులైనా సరే ఇక్కడే ఉండి భూస్థాపితమైపోతాను'' అంటూ కవిత ఆ వీడియలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ పాపం ఊరికే వదలదు: నారా లోకేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలోని మహిళలంతా కన్నీటి పర్యంతమవుతున్నారని, మనోవేదనకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆలూరులో జరిగిన కార్యక్రమంలో సమస్యలపై బాలినేనిని ప్రశ్నించినందుకే కవిత ఇంటికి వైసీపీ మూకలు తాళాలు వేసి వేధించడం, నీళ్లు, పాలు తెచ్చుకునే వీలు లేదంటూ నిర్బంధించడం చాలా దారుణమన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని, కవితను వేధిస్తున్న మాజీ మంత్రి బాలినేని అనుచరవర్గం, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications