ఆ ఊళ్లో పగలు నైటీ ధరిస్తే జరిమానా!...కులపెద్దల వింత నిబంధన:అధికారుల విచారణ
పశ్చిమగోదావరి:ఆ ఊళ్లో ఆడవాళ్లు పగలు నైటీ వేసుకొని బైటకు రావాలంటే 2 వేల రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందే. కారణం అక్కడ కులపెద్దలు అమలులోకి తెచ్చిన ఒక వింత నిబంధన. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం!...
అనాది నుంచి ఇప్పటికీ ఇక్కడ సామాజిక, న్యాయపరమైన విషయాల్లో కుల పెద్దలే నిర్ణయం తీసుకుంటారు. నిబంధనలు విధిస్తారు. ఆ ప్రకారం అందరూ నడచుకోవాల్సిందే. కాదంటే జరిమానా వేస్తారు. అదీ కాదంటే ఏకంగా ఊరి నుండే బహిష్కరిస్తారు. ఆడవాళ్లు నైటీ వేసుకొని బైటికొస్తే ఫైన్ వేస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు ఉలిక్కిపడి విచారణ ప్రారంభించారు. ఆ ఊరు...పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి.
ఇక్కడే...ఆ వింత రూల్
ఇలా తోకలపల్లి గ్రామంలో నైటీలతో రోడ్లపైకి వస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారని...నైటీ వేసుకున్న ఆడవాళ్లని చూపిస్తే రూ.వెయ్యి నజరానాగా ఇస్తున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం సంచలనం రేపింది. అంతేకాదు ఈ రూల్ అతిక్రమిస్తే ఏకంగా గ్రామం నుంచి వెలి వేస్తామనే గ్రామ పెద్దల కమిటీ నిర్ణయం కలకలం రేపింది. పైగా అలా వసూలు చేసిన డబ్బు డ్రామాభివృద్దికి వినియోగిస్తారట. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారడంతో అధికారులు ఆ ఊరి వైపు పరుగులు పెట్టారు.
నైటీతోనే...అన్ని పనులు
గ్రామస్తులు చెప్పిన సమాచారం ప్రకారం...5 వేల జనాభా కలిగిన తోకలపల్లిలో అత్యధికులు పల్లెకారు కుటుంబాలకు చెందినవారే. వీరు ఇక్కడ 9 మందితో ఒక కుల పెద్దల కమిటీని ఏర్పాటు చేసుకుని వారి మాటే శాసనంలాగా అమలు చేసుకుంటారు. అయితే కొంతకాలం క్రితం నైటీల ధారణ విషయం వీరి దృష్టికి వచ్చింది. గతంలో లాగా కాకుండా మహిళలు పగలు సైతం నైటీలు ధరించే తమ పనిపాటల్లో పాల్గొనడంతో పాటు పిల్లలను స్కూళ్లలో దింపడం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, చివరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో కూడా పాల్గొనటం గ్రామ పెద్దల్లో చర్చనీయాంశంగా మారింది.
సాంప్రదాయాలపై...ఆందోళన
ఇలాగైతే మన ఆచారాలు, కట్టుబాట్ల ఏమి కావాలన్న ఆందోళనతో వారు 7 నెలల క్రితం గ్రామంలోని పెద్దలు కొందరు మహిళలతో ఈ విషయమై మాట్లాడగా వారిలో అత్యధికులు నైటీ ధారణకు వ్యతిరేకంగా స్పందించారు. దీంతో గ్రామ పెద్దలు ఈ విషయాన్ని తమ కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు గ్రామస్థులతో చర్చించి నైటీల ధారణ మీద ఆంక్షలు విధించారు. మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వస్తే రూ.2 వేలు జరిమానా అంటూ దండోరా వేయించారు. రాత్రి పూట మాత్రమే వాటిని ధరించాలని...పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపినవారికి రూ.1,000 ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గ్రామ బహిష్కరణకు వెనుకాడేదిలేదని కులపెద్దలు తీవ్ర హెచ్చరికలు చేశారు.
భిన్నాభిప్రాయాలు...వ్యక్తం
అయితే కుల పెద్దల ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలు ఇలా నైటీలతోనే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు, మార్కెట్లకు వచ్చేస్తున్నారని...ఇది సంప్రదాయం కాదని, చూడటానికి బాగోలేదని...కులపెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని కొందరు పురుషులే కాదు...మహిళలు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండటం గమనార్హం. అయితే అసలు మహిళల వ్యక్తిగతంగా ధరించే వారి దుస్తులపై ఇలా కుల పెద్దల, గ్రామ పెద్దల ఆంక్షలేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల విచారణ...నివేదిక
అయితే మహిళల వస్త్రధారణపై ఆంక్షలు విధిస్తూ...ఆ ఆంక్షలను అమలు పరచడమే కాకుండా ఆ విషయాన్నిఆరు నెలలుగా బహిరంగంగా మైక్లో ప్రచారం జరుగుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ గ్రామంలో కట్టుబాటు అంటూ ఈ విషయమై ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోవడం వల్లే తమ దృష్టికి రాలేదంటున్నారు అధికారులు. విషయం తెలిసిన వెంటనే గురువారం ఈ గ్రామానికి తరలివచ్చిన తాహసీల్దార్ ఎం.సుందర్రాజు, ఎస్ఐ ఎం.విజయ్కుమార్ గ్రామంలో ఇంటింటికీ తిరిగి వస్త్రధారణపై ఆంక్షలపై విచారణ జరిపి వివరాలు సేకరించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని,స్త్రీలు స్వేచ్ఛగా జీవించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వారు స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రాథమిక నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం.