నడిరోడ్డుపై ఉరేసుకుంటా: ‘బ్రోకర్’ అంటూ విజయసాయికి బండారు సవాల్
విశాఖపట్నం: తనపై వచ్చిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే నడిరోడ్డుపై ఉరి వేసుకుంటానని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

సత్తా ఉంటే నిరూపించు..
సత్తా ఉంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతిపరులు, జైలుకు వెళ్లి వచ్చినవారు తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

బ్రోకర్, సిగ్గు చేటంటూ విజయసాయిపై..
విజయసాయిరెడ్డి ఒక బ్రోకర్ అని బండారు సత్యనారాయణ ధ్వజమెత్తారు. ‘విశాఖ ఎల్లలు తెలియని వ్యక్తి నాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. నిరాధార ఆరోపణలు చేయడం కాదు. మీ దగ్గర ఆధారాలుంటూ నిరూపించండి. అంతే తప్ప ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడవద్దు' అని విజయసాయి రెడ్డిని హెచ్చరించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో భూములు కబ్జా కాకుండా చూశానని గుర్తుచేశారు.

ఇలాంటి నాపై ఆరోపణలా?
తనకు విశాఖ, హైదరాబాద్లో కనీసం ఇల్లు కూడా లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి ఆస్తులతోనే ఇప్పటికీ ఉన్నానని చెప్పారు. ఇన్నాళ్ల ప్రజాజీవితంలో ఎటువంటి అవినీతికీ పాల్పడలేదని బండారు తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. విశాఖను దోచుకోవడానికి, వ్యవస్థను నాశనం చేయడానికి విజయసాయిరెడ్డి వచ్చారని బండారు ఆరోపించారు.

బండారు హెచ్చరిక
తన కుమారుడిపై ఆరోపణలు చేసే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని, మరోసారి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతానని బండారు హెచ్చరించారు. తానెప్పుడూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని, నైతిక విలువలు కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications