బంద్: పోలీసు స్టేషన్లపై జగన్ పార్టీ కార్యకర్తల దాడి
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం శనివారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రకాష్నగర్ పోలీస్స్టేషన్ను ముట్టడించి దాడి చేశారు. స్టేషన్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.
వైసిపి కార్యకర్తల దాడిలో ప్రకాష్నగర్ ఎస్ఐ శివగణేష్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరబాబు, గంగాధర్లు స్వల్పంగా గాయపడ్డారు. బంద్ సందర్భంగా నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు ఆదిరెడ్డి వాసు, జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ను అరెస్ట్ చేసి ప్రకాష్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు.

విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు-వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. వెంటనే పెద్దసంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రకాష్నగర్ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలావుంటే, బంద్ సందర్భంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పోలీస్స్టేషన్ను వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. నెహ్రూ చౌక్ వద్ద వైసీపీ, వామపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే అరెస్ట్కు నిరసనగా వైసీపీ కార్యకర్తలు అనకాపల్లి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి స్టేషన్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications