నాడు ఏజీ బిఎస్సీ...నేడు ఏపీ డీజీపీ...
బాపట్ల: బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ పూర్వ విద్యార్థుల్లో మరో ఆణిముత్యం అత్యన్నత స్థాయి హోదాను అలంకరించింది. అంతేకాదు...ఎంత ఎదిగినా నేటికి గురువుల ముందు ఒదిగే ఉండే ఉత్తమ విద్యార్థి...ఆనాటి నుంచి ఈనాటివరకు తోటి విద్యార్థులతో సాహచర్యాన్ని విడనాడని స్నేహశీలి...ఈ సుగుణాలతో ఆ కళాశాల చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఆ ఆణిముత్యం...మరెవరో కాదు...మన ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపి డాక్టర్ మన్నం మాలకొండయ్య...
పట్టుదలకు నిర్విరామ కృషి తోడైతే అత్యుత్తమ ఫలితాలు రావడం ఖాయమని నిరూపించారు ఎపి న్యూ డిజిపి మాలకొండయ్య. ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండా కష్టపడి చదివి సివిల్స్లో విజయం సాధించి ఐపీఎస్కు ఎంపికైన అసాధారణ ప్రజ్ఞాశాలి ఈయన. విధి నిర్వహణలోను నీతి, నిజాయితీలతో పనిచేస్తూ సమర్థ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తాను చదివిన కళాశాల, పాఠాలు చెప్పిన గురువులు, తోటి స్నేహితులను మరిచిపోకుండా అవకాశం ఉన్నప్పుడల్లా వారిని కలుస్తూ ఎంతో అప్యాయంగా మెలుగుతుంటారు.
స్వస్థలం...స్వభావం...
ప్రకాశం జిల్లా నలదలవూరుకు చెందిన మన్నం మాలకొండయ్య బాపట్ల ఏజీ కళాశాలలో 1976 నుంచి 1980 వరకు ఏజీ బీఎస్సీ చదివారు. ఆ సమయంలో ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సౌమ్యుడిగా, మంచి ఆలోచనాపరుడిగా, సునిశిత బుద్ధితో మెలిగేవారు. గురువుల పట్ల భక్తిశ్రద్దలతో కనబరుస్తూ సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచేవారు. నిరంతరం చదువుపైనే ధ్యాస నిలిపి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తిని కనబరిచేవారు. సహచరులు ఎవరైనా తప్పు చేస్తుంటే సున్నితంగా వద్దని వారిస్తూ మంచి మార్గాన్ని అనుసరించేలా చేసేవారు. నాయకత్వ లక్షణాలు, నీతి, నిజాయితీలతో వ్యవహరించడం విద్యార్థి దశ నుంచే అలవడ్డాయి.
ముందు...తరువాత
ఎజి బిఎస్సీలో ఫస్ట్ క్లాస్ లో పాసై తిరుపతిలో ఏజీ ఎమ్మెస్సీలో చేరి ఆరు నెలలు చదవగానే కార్పొరేషన్ బ్యాంకు అధికారులు ఆయనను పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే రాత్రి పూట కళాశాలలో చదివి ఎల్ఎల్బీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారంటే ఆయన పట్టుదల, నిరంతర శ్రమ అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత తన లక్ష్యం బ్యాంకు అధికారి కాదని భావించిన ఆయన సివిల్స్కు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా పరీక్షలకు సిద్ధమై 1985లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. అనంతరకాలంలో గుంటూరు జిల్లా ఎస్పీగా, రేంజ్ డీఐజీగా సేవలందించారు.
ఎంత ఎదిగినా...ఒదిగే...
ఐపీఎస్ అధికారిగా క్షణం తీరిక లేకున్నాతన ఉన్నతికి కారణమైన బాపట్ల ఏజీ కళాశాలలో ఉత్సవాలకు ఖచ్చితంగా హాజరయ్యేవారు. గురువులు, స్నేహితులను కలిసి అప్యాయంగా మాట్లాడేవారు. తనకు పాఠాలు చెప్పిన గురువులు ఎక్కడ కనపడినా తానే ఎదురువెళ్లి వారిని పలుకరించి వారి ఆశీర్వాదం తీసుకునేవారు. పూర్వవిద్యార్థుల సమావేశాలకు హాజరయ్యేవారు. బాపట్లలో స్నేహితులు, గురువుల ఇళ్లల్లో జరిగే వేడుకలకు వస్తుండేవారు. వ్యవసాయ కళాశాల, గడియార స్తంభం, భావనారాయణస్వామి ఆలయం, రైల్వేస్టేషన్తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవితం నాటి రోజులను గుర్తు చేసుకుంటారు.
ఇటీవలి కాలంలో సైతం...
మాలకొండయ్యకు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడంతో స్నేహితులకు పుస్తకాలు బహుమతిగా ఇస్తుంటారు. ఇదే ఏజీ కళాశాలలో 1974 బ్యాచ్కు చెందిన తన సీనియర్ విద్యార్థి అజేయ కల్లం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా గత మార్చి 18 తేదీన పూర్వవిద్యార్థులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో కలిసి ఏజీ కళాశాలలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆ సమయంలో కళాశాల మొత్తం కలియ తిరిగి విద్యార్థులను ఉన్నత లక్ష్యంతో బాగా చదవాలని ప్రోత్సహించారు.
ఎజి కాలేజ్ నుంచి...ఎన్నో ఆణిముత్యాలు...
బాపట్ల ఏజీ కళాశాల పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు దాదాపు 150 మంది సివిల్ సర్వీసులకు ఎంపిక కావటం విశేషం. వ్యవసాయ విద్య నేపథ్యం, పునాదే అందుకు దోహదపడిందని విద్యావేత్తలు విశ్లేషించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అజయ్ కల్లం, జిల్లా కలెక్టర్గా పని చేసిన కాంతిలాల్దండే ఈ కళాశాల విద్యార్థులే. ఈ కాలేజ్ ఒకప్పటి విద్యార్థులైన ఆరిజ్ అహ్మద్, వేణుగోపాల్రెడ్డి, బాలాజీ మజుందార్, అయ్యంగార్ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులుగా పని చేస్తున్నారు. అలాగే డీజీపీలుగా, విదేశాంగ శాఖ అధికారులుగా, రిజర్వు బ్యాంకు, అటవీ, ఆదాయపన్ను శాఖల్లో ఉన్నతస్థానాల్లో సేవలందిస్తూ బాపట్లకు గర్వకారణంగా నిలిచారు.