టీడీపీ ఎంపీ మాగుంటపై బాంబు పేల్చిన కేజ్రీవాల్ భార్య
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరింత కూరుకుపోయారు. ఈ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.
అదే సమయంలో సీబీఐ అధికారులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. కేజ్రీవాల్ను కోర్ట్ రూమ్లోనే విచారించడానికి అనుమతి సైతం లభించింది. కేజ్రీవాల్ను అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) 1988 కింద అరెస్ట్ చేశారు.

ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. సీబీఐ కేసులో కవిత కస్టడీ ఈ నెల 18వ తేదీ వరకు ఉండబోతోంది.
ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గానీ, కవిత గానీ తమకు సహకరించట్లేదంటూ అటు ఈడీ అధికారులు కూడా గతంలో పలుమార్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తాము అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారనేది వారి వాదన. జ్యుడీషియల్ కస్టడీ ప్రతీసారీ పెంచుకుంటూ వెళ్లడానికి ఇదే ప్రధాన కారణమైంది.
తాజాగా- అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన అరెస్ట్ వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారని సమాచారం. మాగుంట ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని తేలింది.

ఈ విషయాన్ని కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి టీడీపీ-జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇఛ్చిన తప్పుడు స్టేట్మెంటేనని అన్నారు.
ఢిల్లీలో మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది వ్యక్తల వద్ద తనను డిమాండ్ చేశారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చాడని, ఇది పూర్తిగా అవాస్తవం అని సునీత కేజ్రీవాల్ అన్నారు. మూడో వ్యక్తి ఉన్నప్పుడు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తారా? అని ప్రశ్నించారు.
2022 సెప్టెంబర్ 17వ తేదీన మాగుంటకు చెందిన కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారని వివరించారు. ఈ సందర్భంలో కేజ్రీవాల్ను ఎప్పుడైనా కలిశారా? అంటూ ఈడీ ప్రశ్నించగా.. 2021 మార్చి 16వ తేదీన ఢిల్లీ సచివాలయంలో కేజ్రీవాల్ ఛాంబర్లో ఆయనను కలిసినట్లు చెప్పారు.
ఢిల్లీలో ఓ ఛారిటబుల్ ట్రస్ను ప్రారంభించాలనుకుంటున్నానని, దాని కోసం స్థలం కేటాయించాలని కోరడానికి కేజ్రీవాల్ను మాగుంట కలిసినట్లు తెలిపారు. భూముల కేటాయింపు వ్యవహారం లెప్టెినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటుందని, దరఖాస్తు ఇవ్వాలని మాగుంటకు సూచించారు.
CBI द्वारा CM अरविंद केजरीवाल जी की गिरफ्तारी पर सुनीता केजरीवाल जी का बड़ा खुलासा 👇 pic.twitter.com/Kin9rwTXfP
— AAP (@AamAadmiParty) July 6, 2024
మాగుంట ఇచ్చిన ఈ స్టేట్మెంట్.. ఈడీకి ఏ మాత్రం నచ్చలేదని, కొద్దిరోజుల తరువాత ఆయన కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారని సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. మళ్లీ మాగుంటను విచారించగా.. పాత స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారని చెప్పారు. దీనితో రాఘవరెడ్డికి బెయిల్ దక్కలేదని, దీనితో రాఘవరెడ్డి భార్య ఆత్మహత్యకు ప్రయత్నించారని అన్నారు.
ఇవన్నీ చూసి బెయిల్ కోసం మాగుంట.. ఈడీ అధికారుల వద్ద తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని సునీత ఆరోపించారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆరంభించాలంటూ కేజ్రీవాల్ తనను ఒత్తిడి పెట్టాడని, దీనికోసం 100 కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ మాగుంట స్టేట్మెంట్ మార్చి చెప్పాడని సునీత అన్నారు.












Click it and Unblock the Notifications