బ్యుటిషియన్ కవిత: టీ ముఖచిత్రం మారుస్తారా?
హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి మధు యాష్కీని ఢీకొడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయ, పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో అకస్మాత్తుగా ఎదిగినట్లు కనిపిస్తారు. ఆమె పోటీ కారణంగా నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. 35 ఏళ్ల కవిత రాజకీయాల్లో తన ముద్రను వేసి తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చాలని అనుకుంటున్నారు.
ఆమె సంప్రదాయబద్దమై చీరె, జాకెట్టు ధరించి పైకి కనిపిస్తారు. అయితే, ఆమెలో బహుముఖాలున్నాయి. కుటుంబం, వృత్తి, రాజకీయాలు ఆమెను నిరంతరం ఆమెను తీరిక లేకుండా చేస్తున్నాయి. అన్ని బాధ్యతలను ఆమె సమానంగా భుజాన మోస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన కవితకు రాజకీయాలంటే తెగని మక్కువ. తండ్రి రాజకీయాలు ఆమెకు కూడా ఒంటబట్టాయి.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. 2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ముందు నువ్వేమిటో నిరూపించుకోవాలని తండ్రి సూచించడంతో పోటీ చేయాలనే ఉద్దేశం నుంచి అప్పుడు వెనక్కి తగ్గారు.
కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై జరిగిన మిలియన్ మార్చ్లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సోదరుడు కెటి రామారావుతో భుజం భుజం కలిపి ముందుకు నడిచారు. ఆ తర్వాత 2010 జనవరి 12వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదుర్స్కు వ్యతిరేకంగా తెలంగాణలో చేపట్టిన ప్రచారం ఆమెను ముందు వరుసలోకి తెచ్చింది.
తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే వారి సినిమాలను తెంలగాణలో ఆడనివ్వబోమని ఆమె హెచ్చరించారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించారు. బతుకమ్మ పండుగను ఉద్యమ స్థాయికి తెచ్చిన ఘనత ఆమెదే. మరుగున పడిపోతున్న తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు మళ్లీ జీవం పోశారు.
తాను నిజామాబాద్ కోడలిని అని చెప్పుకుంటూ నిజామాబాద్ లోకసభ స్థానంలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమె భర్త అనిల్ మెకానికల్ ఇంజనీర్. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ శాసనసభా నియోజకవర్గంలో ఉంది. ఆమెపై బిజెపి నుంచి యెండల లక్ష్మీనారాయణ, కాంగ్రెసు నుంచి మధు యాష్కీ పోటీలో ఉన్నారు. అయితే, ఆమె ఇప్పటికే మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. తండ్రి, సోదరుడికి ఎన్నికల ప్రచారం చేసిన కవితకు తన కోసం ప్రచారం చేసుకోవడంలో ఏ విధమైన ఇబ్బందీ ఎదురు కావడం లేదు. పైగా, ఆమెది ఎవరితోనైనా ఇట్లే కలిసిపోయే మనస్తత్వం.
హైదరాబాద్లోని స్టాన్లీ హైస్కూల్లో చదివిన కవిత అమెరికాలోని యూనివర్శిటీ ఆఫఅ సదర్న్ మిసిసిపిలో మాస్టర్స్ చేశారు. రాజకీయాల్లో మాత్రమే నిండా మునిగిపోయి లేరు. హైదరాబాదులోని బంజారాహిల్స్లో పేద పిల్లల కోసం ఉచితంగా పాఠశాల నడుపుతున్నారు. తెలంగాణ ప్రజాతంత్ర, రాజ్యాంగ హక్కుల వేదిక కన్వీనర్ కూడా. ఇంటర్నేషనల్ డెల్ఫఇక్ కౌన్సిల్ ఇండియన్ చాప్టర్ అధిపతి కూడా.
వాటికి తోడు, ఆమె వ్యాపారంలో కూడా దిట్ట. హైదరాబాద్, సికింద్రాబాదు జంటనగరాల్లోని దిల్షుక్నగర్, సైనిక్పురి, హిమాయత్నగర్ ప్రాంతాల్లో గొలుసు బ్యూటీ సలూన్స్ నడుపుతున్నారు. వాటి వ్యాపారం జోరుగానే ఉంది. అయితే, వాటి క్లయింట్స్ ఎక్కువగా తెలంగాణేతరులు కావడం విశేషం.