Chittoor: వీడిన ప్రశాంతి హత్య కేసు మిస్టరీ.. ప్రియుడే అంతకుడు..!
చిత్తూరు(Chittoor)లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ మృతి మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను గొంతు నులిమి చేసినట్లు తెలిసింది. అనంతరం అతను కూడా చేతులు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొడుకు 15 ఏళ్ల క్రితం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. పెద్ద కూతురుకు సంవత్సరం క్రితం పెళ్లి చేశారు. చిన్న కూతురు దుర్గాప్రశాంతి ఎం ఫార్మసీ పూర్తి చేసింది. సంవత్సరం క్రితం ఆమె హైదరాబాద్ కు వెళ్లి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది.
అనంతరం చిత్తూరు తిరుగొచ్చిన ప్రశాంతి.. నాలుగు నెలల క్రితం బ్యూటీపార్లర్ ప్రారంభించింది. అయితే అంతకు ముందే దుర్గాప్రశాంతికి ఫేస్బుక్లో తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన చక్రవర్తి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను దుబాయ్ లో రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈక్రమంలోనే దుర్గాప్రశాంతితో ఫేస్ బుక్ లో కలిశారు. రెండు నెలల క్రితం చక్రవర్తి ఇండియాకొచ్చాడు. ఆ తర్వాత తన తల్లితో పాటు చిత్తూరు చేరుకున్నాడు. అక్కడే దర్గా కూడలిలో దుకాణం పెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు.

చక్రవర్తి, అతని తల్లి దుర్గాప్రశాంతి ఇంటి దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇలా చక్రవర్తి తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిరకు కూడా పరిచయం ఏర్పడింది. మంగళవారం వీరిద్దరు కలిసి మరో ఊరు వెళ్లగా.. చక్రవర్తి బ్యూటీపార్లర్ వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం 12: 30 గంటలకు ప్రశాంతి, చక్రవర్తి బ్యూటీపార్లర్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. సాయంత్రం ఇందిర వచ్చి బ్యూటీపార్లర్ తలుపులు బద్దలు కొట్టి చూడగా.. దుర్గప్రశాంతి చనిపోయి ఉండగా.. చక్రవర్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే చక్రవర్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రశాంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదటగా వీరిద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించగా.. తర్వాత ఇది హత్యగా తేలింది. చక్రవర్తి ప్రశాంతిని హత్య చేసిన అనంతరం బ్లేడ్ తో చేతిని కోసుకున్నట్లు తెలిసింది. ప్రశాంతి, చక్రవర్తి పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతోనే చక్రవర్తి ఇలా చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications