వైఎస్ జగన్ హెల్ప్: మళ్లీ లైమ్ లైట్లోకి థర్డ్ ఫ్రంట్: మమతా బెనర్జీ కీలక లేఖ
అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష నేతలకు కీలక లేఖ రాశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఊపిరి సలపనంతగా బీజీ షెడ్యూల్లో ఉంటోన్న మమతా బెనర్జీ.. తీరిక చేసుకుని మరీ.. ఈ లేఖను రాశారు. మూడు పేజీల ఈ లేఖను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, చర్యలను ఆమె ఈ లేఖలో ఎండగట్టారు.
రత్నప్రభ ఎస్సీ కాదా: క్రిస్టియనా: అయిదు పెండింగ్ కేసులు: జేడీయూ నేత ఎంట్రీ
కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను కుదించడం పట్ల..
బీజేపీ తీసుకుంటోన్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వ్యతిరేకించడానికి విపక్షాలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అధికారాలు, పరిధిని కుదిస్తూ ఎన్డీఏ కూటమి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం గురించి మమతా బెనర్జీ ప్రస్తావించారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు 2021 వల్ల కేజ్రీవాల్ ప్రభుత్వం తనకు సంక్రమించిన అధికారాలను కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను కుదించి.. దాన్ని లెప్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెట్టడం అప్రజాస్వామ్యమని మమతా బెనర్జీ ఈ లేఖలో ప్రస్తావించారు.
వైఎస్ జగన్ సహా..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు సీఎంలు, ప్రతిపక్ష నేతలకు ఈ లేఖను రాశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ (ఎంఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్యలకు ఈ లేఖను పంపించారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటోన్న ఇలాంటి ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను అడ్డుకోవడానికి బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మోడీ సర్కార్ అనుసరిస్తోన్న ఇలాంటి విధానాలను ఇఫ్పుడే అడ్డుకోకపోతే.. మున్ముందు మరింత ప్రమాదకరంగా పరిణమించడానికి అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మమతా బెనర్జీ గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే- ఈ దిశగా ఓ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
థర్డ్ ఫ్రంట్..
తాజాగా- మమతా బెనర్జీ ఈ లేఖ రాయడం సరికొత్త రాజకీయ పరిణామాలకు తెర తీసే అవకాశాలు లేకపోలేదు. మరోసారి థర్డ్ ఫ్రంట్ ఉనికిలోకి రావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ను కూడా ఇందులో చేర్చడం ఎలా ఉన్నప్పటికీ.. క్రమంగా మమతా తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు దారి తీయొచ్చని అంటున్నారు. కాగా- కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను కుదించే బిల్లును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఇదివరకు మూడు వ్యవసాయ బిల్లులు సహా కొన్నింటిపై కేంద్రానికి అండగా నిలిచిన వైసీపీ.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి బాసటగా నిలవడం చర్చనీయాంశమైంది.