ఓటుకు నోటుపై భన్వర్ లాల్, సెక్షన్ 8 మాత్రమే ఎందుకని ఉండవల్లి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీఈవో భన్వర్ లాల్ గురువారం స్పందించారు. ఓటుకు నోటు వ్యవహారం క్రిమినల్, అవినీతి కేసు అన్నారు. ఈ వ్యవహారం పైన ఏసీబీ కూడా కేసు పెట్టవచ్చునని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఈసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏసీబీ ఇచ్చిన ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కావాలని ఏశీబీ కోర్టులో ఈసీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సెక్షన్ 8 మాత్రమే ఎందుకు: ఉండవల్లి
ఓటుకు నోటు కేసులో నిందితులకు శిక్ష తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడాలని, ఏపీకి చెందిన మంత్రులు, టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
విభజన బిల్లులో ఎన్నో అంశాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నో అంశాలు ఉండగా కేవలం సెక్షన్ 8 గురించి మాత్రమే ఎందుకు పదేపదే పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. విభజన బిల్లులో ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, ఆర్థిక లోటు భర్తీ అంశాలు ఉన్నాయన్నారు. వాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
ఢిల్లీ జాతీయ రాజధాని అయితే, విశాఖ పట్టణం సహజ సంపదకు రాజధాని ఏపీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన సందర్భంగా విశాఖలో విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా పైన సమీక్ష నిర్వహించారు.
విభజన చట్టంలో పెట్రో యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేస్తామని చెప్పారని, దాని కోసం తూర్పు గోదావరి జిల్లాలో ఐదు ప్రాంతాలను ఎంపిక చేసి పంపామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలోని మాధవరం పెట్రో యూనివర్సిటీకి అనుకూలంగా ఉంటుందన్నారు.
ఏపీకి ఇంకా 41 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కావాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎల్పీజీ కనెక్షన్ అందిస్తామన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఎల్ఈడీ బల్బులు కావాలని ఆయన కోరారు.