బాబుపై జగన్ వ్యాఖ్యలు-బాలకృష్ణ డబ్బు పంపకంపై భన్వర్ లాల్ స్పందన
నంద్యాల ఉప ఎన్నికలలో ఓటర్లు భయం, ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని ఈసీ భన్వర్ లాల్ సోమవారం చెప్పారు. సాయంత్రం ఆరు గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలలో ఓటర్లు భయం, ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని ఈసీ భన్వర్ లాల్ సోమవారం చెప్పారు. సాయంత్రం ఆరు గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
నంద్యాలలో కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రచార పర్వం సమయంలో రూ.16 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు.
ఓటర్లను ప్రభావితం చేయవద్దని అభ్యర్థులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బాలకృష్ణ డబ్బు పంపకంపై కలెక్టర్ను వివరణ అడిగామన్నారు. నాపై కూడా ఫిర్యాదు చేసే హక్కు పార్టీలకు ఉందన్నారు.
ఓటు ఎవరికి వేశారో చెప్పినా చర్యలు ఉంటాయన్నారు. బల్క్ ఎస్సెమ్మెస్లు పంపవద్దని చెప్పారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉండాలన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఏర్పాట్లు చేశామన్నారు.
255 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ ఉంటుందన్నారు. 71 సున్నిత, 144 అతి సున్నిత ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో 2లక్షల 18వేల మంది ఓటర్లు ఉన్నారు.
వాట్సాప్, సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు చెప్పారు. 16 ఛానల్స్ను రికార్డ్ చేస్తున్నామన్నారు. ఓటు ఎవరికి వేశారనేది ఓటరుకు మాత్రమే తెలుస్తుందని, స్క్రీన్ పైన 7 సెకంట్లు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకున్నామన్నారు.