మోదీకి జగన్ భారీ షాక్:‘భారత్ బంద్’కు వైసీపీ మద్దతు -రైతుల పోరుకు రెస్పెక్ట్ -చంద్రబాబుపైనా తూటాలు
ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ భారీ షాకిచ్చారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో మద్దతిచ్చిన వైసీపీ.. ఇప్పుడా చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికింది. ఎన్డీఏ ప్రాణమిత్రులైన అకాళీదళ్ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగిన క్లిష్టసమయంలో.. ఎన్టీఏలో లేకున్నా.. తానున్నానంటూ కేంద్రానికి బాసటగా నిలిచిన జగన్.. ఇప్పుడు కేంద్రం వద్దంటోన్న భారత్ బంద్ కు సంఘీభావం తెలపడం రాజకీయంగా సంచలనం రేపుతున్నది.
ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?
ఏపీలో అధికారికంగా బంద్
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో నిరసనల ప్రభావం తక్కువే అయినా, అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా తామూ బంద్ లో పాల్గొంటామని పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ శ్రేణులు నేరుగా బంద్ లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. డజనుకుపైగా పార్టీలు బారత్ బంద్ కు మద్దతివ్వగా, ఏపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగించింది. ఎట్టకేలకు సోమవారం రాత్రి ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఓ అధికారిక ప్రకటన చేశారు. ఏపీలో బంద్ అధికారికంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
రైతుల మనోభావాలకు గౌరవం..
మంగళవారం జరుగనున్న భారత్ బంద్ ను ఏపీలో అధికారికంగా నిర్వహిస్తామన్న మంత్రి కన్నబాబు.. వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలంటూ పోరాడుతోన్న రైతాంగం మనోభావాలను ఏపీ ప్రభుత్వం గౌరవిస్తున్నట్లు తెలిపారు. భారత్ బంద్ సందర్భంగా ఏపీలో పాటించాల్సిన విధులు, అసలు వ్యవసాయ చట్టాలకు వైసీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందనే వివరణతోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు ద్వంద్వనీతిని ఎండగడుతూ మంత్రి కన్నబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఏం చెప్పారో మంత్రి మాటల్లోనే..
మధ్యాహ్నం దాకా ఏదీ వద్దు..
‘‘దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం నిర్వహించతలపెట్టిన బంద్ విషయంలో వారి మనోభావాలను గౌరవిస్తున్నాం. అయితే రైతు సంఘాలు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా, మధ్యాహ్నం 1 గంటలోపు బంద్ను ముగించుకుంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని ఆదేశిస్తున్నాం. అలాగే ఒంటి గంట వరకూ బస్సు సర్వీసులను నడపవద్దని ఆర్టీసీని కూడా ఆదేశిస్తున్నాం. విద్యాసంస్థలను పాఠశాలలు పూర్తిగా మూసివేయాల్సిందిగా కూడా ఆదేశిస్తున్నాం. బంద్ పూర్తి స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆ హామీ వల్లే వైసీపీ మద్దతు
ఇక్కడే మరొక విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. నిజానికి కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు పార్టీ బేషరతుగా, గట్టిగా ఆరోజు మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ)కు పూర్తి భరోసా ఇస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలో మాత్రమే, రైతుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికిన విషయంకూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ..
రైతులపై చంద్రబాబు డ్రామాలు..
చంద్రబాబు మరో యూటర్న్ తీసుకుని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు మంగళవారం విజ్ఞాపనలు ఇవ్వాల్సిందిగా నిర్ణయించారని మీడియా ద్వారా వింటున్నాం. పార్లమెంటులో బిల్లులకు బేషరతుగా మద్దతు పలికి, ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు పార్టీ విజ్ఞాపనలు ఇవ్వడం ఎంతటి దిగజారుడు రాజకీయమో అందరికీ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల అంశంలో కలెక్టర్లకు ఏం పాత్ర ఉంటుంది? వ్యవసాయ బిల్లులు సెప్టెంబరులో ఆమోదం పొందితే నవంబరు వరకూ కనీసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం ముక్కకూడా రాయలేదు. ఇవాళ కూడా ఢిల్లీ వెళ్లి గతంలో మాదిరిగా ఒక ధర్నా చేస్తానని కూడా ప్రకటించడంలేదు. మరి ఎందుకు ఈ డ్రామాలు?'' అని మంత్రి కన్నబాబు ప్రకటనలో పేర్కొన్నారు. చివరిగా..
మోదీకి వైసీపీ హితవు..
ఏ పరిస్థితుల్లో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చామో ప్రభుత్వ ప్రకటన ద్వారా వివరించిన మంత్రి కన్నబాబు.. చివర్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరుగుతున్న చర్చలు త్వరలోనే సఫలమై మంచి పరిష్కారాలు లభించాలని కోరుకుంటున్నామని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే పార్టీగా, రైతుపక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రకటన చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. రైతుల నిరసనలు, భారత్ బంద్ విషయంలో వైసీపీ తీసుకున్న స్టాండ్ పై బీజేపీ స్పందించాల్సి ఉంది. వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నవారంతా అభివృద్ధి నిరోధకులని, కొత్త సంస్కరణలు లేకుంటే నవశకం దిశగా ముందుకు సాగలేమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వ్యాఖ్యానించారు.
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుస