ఏపీకి భారీ పెట్టుబడి - సీమలో గేమ్ ఛేంజర్..!!
ఏపీలో మరో కీలక పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి. రక్షణ రంగంలో ఏపీకి భారీ ప్రాజెక్టు రానుంది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు మొదలయ్యాయి. రాయలసీమ కేంద్రంగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జిటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జిటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది.
సీమలో రక్షణ రంగంలో
ఏపీకి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. యుద్ధరంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారుచేసే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తన అను బంధ కంపెనీ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టం లిమిటెడ్ (కేఎస్ఎస్ఎల్) ద్వారా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఏపీ కేంద్రంగా అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జిటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తమ ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. రక్షణ రంగానికి కావాల్సిన సామాగ్రితో పాటుగా మెరైన్, మైనింగ్, రైల్వే కోచ్ల తయారీకి కూడా తమ సంస్థ పరికరాలను అందిస్తుందని వివరించింది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఈ కేఎస్ఎస్ఎల్ సంస్థ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టం ప్రొటెక్టెడ్ వెహికల్స్, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ అప్గ్రేడ్, మందుగుండు సామగ్రి, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించింది. ఏపీలో తమ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనల్లో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. రెండు దశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రతిపాదనలు సమర్పించింది. మన దేశం తో పాటు ప్రపంచదేశాలకూ రక్షణ సామగ్రి సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా
స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులుగా 550 మందికి ఉపాధి అందుతుందని పేర్కొంది. ఈ సంస్థ ఏర్పాటు లో భాగంగా తొలి దశకు దాదాపు వెయ్యి ఎకరాల భూమి కావాలని, రెండ దశలో మరో 500 ఎకరాల మేర భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది.
మడకశిర కేంద్రంగా
ఈ సంస్థ ఇప్పటికే అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి, ఆర్.అనంతపురం గ్రామాల పరిధిలోని భూములను పరిశీలన చేసింది. తాము తయారు చేసిన యుద్ధసామగ్రి సామ ర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి ఈ భూములు అవసరమని పేర్కొంది. తమ సంస్థలో మందుగుండు, ఫిరంగుల షెల్స్, రక్షణ రంగ పరికరాలను తయారు చేస్తామని ప్రభుత్వానికి నివేదించింది. దశల వారీగా ప్రాజెక్టు విస్తరణ.. ఉత్పత్తి లక్ష్యాలను వివరించింది. 2029 నాటికి అడ్వాన్స్డ్ ఎనర్జిటిక్స్ సిద్దం అయ్యేలా ముందుకు వెళ్తామని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం తాజా ప్రతిపాదనల పైన అధ్యయనం చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications