ఆత్మకూరులో తెర వెనుక రాజకీయం - నేడే బీజేపీ నామినేషన్ : మేకపాటి మెజార్టీ పైనే..!!
ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్ధుల సంఖ్య పెరుగుతోంది. మంత్రిగా ఉంటూ హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు పోటీ చేస్తున్నారు. మేకపాటి కుటుంబం నుంచే ఉప ఎన్నికలో బరిలో నిలవటంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని...ఇతర పార్టీలు సహకరిస్తాయని అంచనా వేసారు. అయితే, టీడీపీ - జనసేన తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెబుతూ బీజేపీ తమ అభ్యర్ధిని రంగంలోకి దించింది. ఆ పార్టీ నుంచి భరత్ కుమార్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
బీజేపీ అభ్యర్ధి నామినేషన్ ..పార్టీ ప్రముఖులు సైతం
ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆత్మకూరు ఎన్నికలలో పోటీ చేయడానికి బిజెపి రాష్ట్ర శాఖ కు సుమారు ఆరు దరఖాస్తులు రాగా బిసి నేతను ఎంపిక చేయడానికి బిజెపి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో భరత్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు.
నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.గతంలో బిజెవైఎం కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా భాధ్యతలు నిర్వహించారు. అదేవిధాంగా కావలి పట్టణ అధ్యక్షుడుగా కూడా భరత్ కుమార్ పని చేశారు. అఖిల భారతీయ విద్యార్ధిపరిషత్ నుండి చురుకైన కార్యకర్తగా పనిచేశారు. వైసీపీ నుంచి ఇప్పటికే మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ నేతలు ఆయనతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
బరిలో ఎనిమిది మంది అభ్యర్ధులు
అయితే, అనూహ్యంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఈ నామినేషన్ల పరిశీలన తరువాత తుది పోటీలో నిలిచే అభ్యర్ధుల జాబితా ప్రకటించనున్నారు. కానీ, మేకపాటి విజయం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, విజయం కంటే మెజార్టీ ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా..మెజార్టీ ద్వారా తమ సత్తా చాటాలని పార్టీ పరంగా వైసీపీ..వ్యక్తిగతంగా మేకపాటి కుటుంబం దీని పైనే ఫోకస్ పెట్టారు. అయితే, బీజేపీ అభ్యర్ధికి ఇతర పార్టీల నుంచి పరోక్షంగా సహకారం అందే పరిస్థితి ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
మెజార్టీనే కీలకం అంటున్న వైసీపీ
కడప జిల్లా బద్వేలు బై పోల్ సమయంలో బీజేపీకి పోటీలో లేని ఇతర పార్టీలు సహకరించాయని..ఇప్పుడు, ఆత్మకూరులోనూ అదే జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కమలం పార్టీ నేతలు బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధి బరిలో నిలుస్తున్నారని చెప్పగా.. జనసేన అధినేత మాత్రం తాము ఆత్మకూరు ఎన్నికకు దూరంగా ఉన్నామని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఆత్మకూరులో చోటు చేసుకుంటున్న రాజకీయాలు .. అంతర్గత వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.