మా మీద ఎందుకంత కోపం, కక్ష?: రోజా వ్యాఖ్యలపై అఖిలప్రియ ఆవేదన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన విమర్శలపై మంత్రి భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. తన తండ్రి చనిపోయిన విషయం కూడా రోజా కామెంట్స్ చేయడం విచారకరమని అన్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన విమర్శలపై మంత్రి భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. తన తండ్రి చనిపోయిన విషయం కూడా రోజా కామెంట్స్ చేయడం విచారకరమని అన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఉండటం ఎంత కష్టమో ఆమెకు తెలుసని తాను అనుకున్నానని.. కానీ ఇలా తనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బాధ కలిగించింది..
భూమా అఖిలప్రియ శనివారం ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల పట్ల తనకు ప్రేమ లేనట్లుగా రోజా మాట్లాడటం సరికాదని అన్నారు. తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే తాను తండ్రి చనిపోయినా అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. తనను అభినందించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం బాధ కలిగించిందని చెప్పారు.
కోపమో.. కక్షో...
రోజా తనపై కక్షతో మాట్లాడిందో, కోపంతో విమర్శించిందో తెలియడం లేదని అఖిలప్రియ అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం ఆమెకు తగదని హితవు పలికారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామని, దానిమీద దృష్టి పెడితే మంచిదని రోజాకు సూచించారు. తన తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని. తాను కూడా అలాగే ఉంటున్నానని అఖిలప్రియ తెలిపారు. రాజకీయ విమర్శలు చేశాను కావొచ్చు గానీ, తాను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. ఇదంతా తన తల్లిదండ్రులను చూసే నేర్చుకున్నానని చెప్పారు.
ఆ భయం పట్టుకుంది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని అఖిలప్రియ ఆరోపించారు. తన తండ్రి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు ప్రజలకు అప్పజెప్తున్నానని తెలిపారని గుర్తు చేసుకున్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఎంత తొక్కాలని చూసినా.. తాను అంత గట్టిగా నిల్చుంటానని అఖిలప్రియ చెప్పారు. తన తల్లిదండ్రుల చివరి కోరిక తీరుస్తానని చెప్పారు.
విమర్శలు పట్టించుకోనని అఖిలప్రియ స్పష్టం చేశారు.
ఆ మాటలు ఎలా వస్తున్నాయో..
తన తండ్రిని హత్య చేయడం అనే మాటలు రోజాకు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అఖిలప్రియ అన్నారు. తన చిన్నతమ్ముడు ఇంట్లో ఉన్నాడని, అతడు ఎంత బాధపడతాడో కూడా చూడకుండా ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి వైయస్ ఎంత గొప్పో.. తనకు కూడా తన తండ్రి అంతే గొప్ప అని అఖిలప్రియ చెప్పారు.
ఎందుకు కక్ష కట్టారో..
జగన్ నుంచి శిల్పా, రోజా వరకు అందరికీ కూతుర్లున్నారని.. కానీ మా మీద ఎందుకు ఇంత కక్ష, కోపమో అర్థం కావడం లేదని అఖిలప్రియ అన్నారు. ఊపిరున్నంత వరకు తాను పశ్చాత్తాపపడే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తాను అని కూడా అనుకోలేదని చెప్పారు.
బాధ కలిగించింది.. అండగా ఉంటాం
కుటుంబంలో ఒకరు చనిపోయి రాజకీయాల్లోకి రావడం తనకెంతో బాధ కలిగించిందని భూమా అఖిలప్రియ చెప్పారు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు భూమా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భూమా అఖిలప్రియ చెప్పారు. ఎన్ని విమర్శలొచ్చిన చిరునవ్వుతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.