ప్రత్యర్థిని గెలిపిస్తానని హామీ ఇచ్చి..!: గెలుపు భుజాన వేసుకున్న భూమా
భూమా నాగిరెడ్డి తన ప్రత్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నాలు చేస్తూ.. కన్నుమూశారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూమా కన్నుమూసిన విషయం.
విజయవాడ: భూమా నాగిరెడ్డి తన ప్రత్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నాలు చేస్తూ.. కన్నుమూశారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూమా కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇదీ భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితం!
2014లో వైసిపి నుంచి పోటీ చేసి గెలుపొందిన భూమా నాగిరెడ్డి.. ఆ తర్వాత తన కూతురు (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే) అఖిల ప్రియతో కలిసి కొద్ది నెలల క్రితం టిడిపిలో చేరారు. చాలా రోజుల తర్వాత ఆయన సొంతగూటికి చేరుకున్నారు.
భూమా నాగిరెడ్డి చేరిక పైన కేఈ కృష్ణమూర్తి వర్గం అంతో ఇంతో స్వాగతించినప్పటికీ, శిల్పా వర్గం మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టిడిపిలో చేరిన తర్వాత కూడా శిల్పా-భూమా వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
చంద్రబాబు జోక్యం
ఆ తర్వాత మాత్రం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. భూమాకు లేదా ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు శిల్పా చక్రపాణి రెడ్డికి అవకాశమిచ్చారు.
మద్దతిచ్చి గెలిపిస్తానని భూమా హామీ
శిల్పా వర్గీయులతో భూమాకు విభేదాలు ఉన్నాయి. అయితే, వారి మధ్య చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు విభేదాలు సమసిపోయేలా చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా భూమా కుటుంబానికి మంత్రి పదవి వస్తుంది. శిల్పా చక్రపాణిని జిల్లాలో గెలిపించే బాధ్యతను ఎంతోకొంత భూమా కూడా నెత్తిన వేసుకున్నారు.
శిల్పా గెలుపును భుజాన వేసుకున్నారు
ఇదే విషయాన్ని ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భూమా చెప్పారు. శిల్పాచక్రపాణి రెడ్డిని తాము గెలిపిస్తామని చెప్పారు. తన కూతురుకు లేదా తనకు ఎవరికి మంత్రి పదవి వచ్చినా బాధ లేదన్నారు. శిల్పా గెలవకుంటే తమదే తప్పవుతుందని భూమా సూటిగా చెప్పారు. తద్వారా శిల్పా చక్రపాణి గెలుపును తన పైన వేసుకున్నారు.
గెలిపిస్తానని చెప్పి..
నిన్నటిదాకా తన రాజకీయ ప్రత్యర్థి అయిన చక్రపాణి రెడ్డిని..తన భుజాలపై వేసుకొని ఇప్పుడు గెలిపిస్తానని భూమా చెప్పారు. ఆ తర్వాత మంత్రి పదవి ఆయన కోరిక. ఈ రెండు తీరకుండానే కన్నుమూశారు.