భూమా మార్క్ రాజకీయం: పదేళ్ల తర్వాత ఫరూక్తో కలిశాడు, టార్గెట్ శిల్పా బ్రదర్స్
విజయవాడ: భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లాలో ప్రధాన తెలుగుదేశం నేతలైన శిల్పా సోదరులకు ఇష్టం లేకున్నా, భూమా కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో భూమా తన పట్టును పెంచుకునేందుకు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఇందులో భాగంగా భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ఫరూక్ ఆదివారం కలుసుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ శిల్పా సోదరులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. వరద పనుల పేరిట నిధులు దుర్వినియోగం చేశారంటూ ఫరూక్ ఆరోపించారు. వారు ఓడిపోయిన నేతలని గుర్తు చేశారు.
ఓడిన వారు సిగ్గుపడాలని, బయటకు కూడా రావద్దని ఫరూక్ హెచ్చరించారు. 'ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయం గురించి చెప్పడానికి ఎమ్మెల్సీ, ఓడిన వారు ఎవరు? ఓడిన వారు ప్రజల్లోకి వెళ్లడానికే సిగ్గుపడతారు. వీరు అభిప్రాయాలు చెప్పడం ఏమిటీ. సీఎం చంద్రబాబుకు నచ్చితే మంత్రి పదవే కాదు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వొచ్చు' అని శిల్పా సోదరులపై ఫరూక్ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

రోడ్ల విస్తరణ గురించి పదేళ్లు అధికారంలో ఉన్న వారు పట్టించుకోలేదని విమర్శించారు. నంద్యాలకు వరదలు వచ్చినప్పుడు 2001లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో పర్యటించారని, సేఫ్టీవాల్ను నిర్మించాలనే ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. అయితే సేఫ్టీవాల్ కట్టడం కష్టమని తాను వ్యతిరేకించానని చెప్పారు.
అయితే ఈ సేఫ్టీ వాల్ నిర్మాణాన్ని గతంలో అధికారంలో ఉన్న నేతలు రూ.90కోట్లతో చేపట్టారని, భూసేకరణ పేరిట డబ్బులు ఇచ్చారని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. వరద పనులకు కేటాయించిన నిధులను సోదరులిద్దరూ మెక్కేశారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో రోడ్ల విస్తరణపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
వారి వారి అభిప్రాయాలను సేకరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించి పూర్తి చేయాలని ఆయన భూమాకు సూచించారు. భూమా మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా పేదలకు 3 వేల ఇళ్లను కట్టించడానికి కృషి చేస్తే, శిల్పా సోదరులు కావాలనే అడ్డుకున్నారని దుయ్యబట్టారు. దీంతో రాబోయే రోజుల్లో కర్నూలు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications