"అందుకే చంద్రబాబు యూటర్న్": "జగన్ పద్మవ్యూహంలో అభిమన్యుడు"
Recommended Video
హైదరాబాద్/ ఒంగోలు: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమల చేయలేదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తప్పుడు హామీలు, మోసపూరిత కుట్రలు, అనైతిక పొత్తులతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
చంద్రబాబు మోసాలను ఎండగడుతూ...
చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ తమ పార్టీ ప్రజల్తోకి వెళ్తోందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించిన వైఎస్సార్ ఆశయాలను కాంగ్రెసు సమాధి చేయాలని ప్రయత్నిస్తోందని, విలువలు విశ్వసనీయత కోసం జగన్ పార్టీని ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జగన్ మొక్కవోని ధైర్యంతో సమస్యలను ఎదుర్కుంటున్నారని అన్నారు.
మేం చరిత్ర సృష్టించాం...
గత పదేళ్లలో ఎన్నో సమస్యలను ఎదుర్కుని తాము చరిత్ర సృష్టించామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు పా్రటీ 8వ ఆవిర్భావ దినోత్సవం సంందర్భంగా ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడారు.
పద్మవ్యూహంలో అభిమన్యుడిలా...
పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారని సజ్జల అన్నారు. కాంగ్రెసును ఎదిరించి బయటికి వచ్చిన తర్వాత జరిగిన కడప ఉప ఎన్నికలో ఐదు లక్షల పైచిలుకు మెజారిటీతో జగన్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రజలకోసం ముందుకు వెళ్తున్నరని అన్నారు.
అన్యాయంగా జైలుకు పంపించారు...
కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయి అక్రమ కేసులతో అన్యాయంగా జగన్ను జైలుకు పంపించాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించిధైర్యంగా ఉప ఎన్నికలను ఎదుర్కున్నారని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున 67 మంది గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ఆరోపించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాకు 150 సీట్లు
తమ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. టిడీపీ దుర్మార్గమైన పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే జగన్ ప్రజా సంకల్పయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ 150కి పైగా స్థానాలు గెలుచకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.