ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం-23 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ ..!
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొల్ల కంపెనీలతో స్కిల్ కార్పోరేషన్ నిధుల్ని కొల్లగొట్టిన వ్యవహారంలో సదరు సంస్ధల ఆస్తుల్ని మరోసారి అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఓసారి ఇలాగే ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ.. ఇవాళ మరోసారి అటాచ్ మెంట్ ప్రకటించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అక్రమాల కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఇవాళ రూ.23.54 కోట్ల మేర చర, స్ధిరాస్తుల్ని అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది. ఏపీలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని ఈడీ పేర్కొంది.

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోందని ఇందులో తెలిపింది. ఈడీ దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండీ ఖాన్వేల్కర్ , సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించి ప్రభుత్వ నిధుల్ని తమ షెల్ కంపెనీలలోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపింది. కాబట్టి వీరికి చెందిన స్దిరచరాస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. అలాగే గతంలో డిజైన్ టెక్ సంస్ధకు చెందిన రూ.31.20 కోట్లను కూడా అటాచ్ చేసినట్లు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది.














Click it and Unblock the Notifications