చంద్రబాబు - తారక్ బిగ్ మీట్: పురందరేశ్వరి బాధ్యతలు
విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. పవన్తో పొత్తు దాదాపు ఫిక్స్ చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు తారక్ ఒకే వేదికమీదకు వస్తున్నారు. నందమూరి కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందింది. లోకేష్ మాత్రం హాజరు కావడం లేదు. ఇప్పుడు ఈ కలయిక ఏపీ రాజకీయాల్లో బిగ్ డిబేట్గా మారింది.
మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మతో చేసిన వంద రూపాయల నాణెం విడుదల చేస్తోంది. ఈ నెల 28న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. 44 మిల్లీమీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ నాణేన్ని వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉంటుంది. రెండవ వైపు ఎన్టీఆర్ చిత్రం ముద్రించారు. దాని కింద హిందీ భాషలో నందమూరి తారక రామారావు శతజయంతి అని ముద్రించారు. ఈ కార్యక్రమం జరిగేది రాష్ట్రపతి భవన్లోనే అయినా... ఆహ్వానాలు అతిథుల ఎంపిక మాత్రం దగ్గుబాటి పురందేశ్వరి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చంద్రబాబు 27 సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు. నందమూరి ఫ్యామిలీ మొత్తం 28న ఉదయం ఢిల్లీకి చేరుకుంటుంది. నందమూరి ఫ్యామిలీతో పాటు ఎన్టీఆర్ సన్నిహితులను పురందేశ్వరి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను కూడా ఈ కార్యక్రమానికి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.

చాలా కాలం తర్వాత నందమూరి కుటుంబ సభ్యుల మధ్య చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. అమిత్ షాతో తారక్ సమావేశం తర్వాత ఇప్పటి వరకు ఈ ఇద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్తో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రపైన అనేక రకాల చర్చ సాగుతోంది. ఈ సమయంలో సినిమాలతో బిజీగా ఉన్న తారక్ టీడీపీకి నవ్ ఆర్ నెవర్గా మారిన ఈ సిచ్యువేషన్లో మద్దతుగా నిలుస్తారా లేదా అనేది పజిల్గా మారుతోంది.

ఇక చంద్రబాబు సభలు,లోకేష్ పాదయాత్ర సమయంలోను జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో అభిమానులు ఫ్యూచర్ సీఎం అంటూ హంగామా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో అవకాశాలపైన లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.అటు పవన్ కళ్యాణ్ సైతం తన వారాహి యాత్రలో పలు మార్లు తారక్ నటన, అభిమానుల మద్దతుపైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్న ఈ ఎన్నికల్లో నందమూరి కుటుంబం ముఖ్యంగా తారక్ మద్దతు అవసరంగా మారుతోంది. దీంతో ఈ సమావేశాన్ని చంద్రబాబు ఎలా సద్వినియోగం చేసుకుంటారు, తారక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పార్టీ సినీ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications