టీచర్లకు జగన్ గుడ్ న్యూస్- ఇక చదువు చెప్పడమొక్కటే పని- కేబినెట్ వర్చువల్ ఆమోదం
ఏపీలో ఉపాధ్యాయులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. బోధన కోసం ఉద్యోగాల్లో చేరిన వీరికి దశాబ్దాలుగా బోధనతో పాటు జనగణన, టీకాల పంపిణీ, ఎన్నికల విధులు అప్పగిస్తున్నారు. ఇప్పుడు వీరికి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది.
ఏపీలో ఉపాధ్యాయులు బోధనపై పూర్తిస్దాయిలో దృష్టిపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడవునా బోధనతో పాటు ఎన్నికలు, జనగణన, టీకాల పేరుతో బోధనేతర విధుల్లో బిజీగా ఉంటున్న వీరికి వాటి నుంచి ఊరట కల్పించింది. ఇకపై టీచర్లు స్కూల్లో పాఠాలు మాత్రమే చెప్పేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉపాధ్యాయలు విధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిబంధనల్ని సవరించింది. అంతే కాదు వీటికి తక్షణం కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది.
ఏపీలో టీచర్లను బోధనకు మాత్రమే పరిమితం చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించేందుకు కేబినెట్ వర్చువల్ గా సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు ఈ మేరకు సవరణల్ని ఆమోదించారు. దీంతో వీటిని గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి. అప్పుడు ఉపాధ్యాయులు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. ఏపీలో విద్యాసంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జాతీయ విద్యావిధానం అమలుతో పాటు పలు విద్యాసంస్కరణల్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లతో పాటు విద్యారంగ నిఫుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.