దేవినేని ఉమకు భారీ ఊరట- అరెస్టు చేయొద్దన్న హైకోర్టు- విచారణకు ఓకే
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన కేసులో అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైన సీఐడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఓ ప్రెస్మీట్లో సీఎం జగన్ మాట్లాడిన వీడియోను మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదర్శించారు. జగన్ వ్యాఖ్యల్ని జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయన విడుదల చేసిన వీడియోపై ప్రభుత్వం నుంచి ఫిర్యాదు అందుకున్న సీఐడీ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు మార్పింగ్ చేసిన వీడియో విడుదల చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. అంతే కాదు 20 నిమిషాల్లో విజయవాడ నుంచి కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు.

సీఐడీ నోటీసుల మేరకు కర్నూల్లో విచారణకు దేవినేని ఉమ హాజరుకాకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ప్రశ్నించేందుకు విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న ఆయన ఇంటికి కూడా వెళ్లారు. అయితే దేవినేని ఉమ అక్కడ కనిపించలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ తర్వాత దేవినేని ఉమ తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో ఈ నెల 29న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరుకానున్నారు. విచారణలోపు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications