ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ గుడ్ న్యూస్..! ఛార్జీల పెంపుపై..
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్నేళ్లుగా ప్రతీ ఏడాదీ అదనపు ఛార్జీల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అందించింది.
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి అంటే 2024-25 కు ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్దిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించింది.

రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్ ను రూపొందించిట్లు ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు. చట్టప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఇంధన ధరలకు, వాస్తవ ధరలకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వార్షిక ఆదాయ అవసరాల కోసం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ లు రూ.56,573 కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా.. వాటిలో రూ.56, 501 కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు నాగార్జున రెడ్డి వెల్లడించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.13589 కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ.3453 కోట్లు ఎక్కువ అన్నారు. అలాగే డిస్కంలు ఉచిత విద్యుత్ కింద చేస్తున్న విక్రయాల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ఆదేశించామన్నారు.












Click it and Unblock the Notifications