ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్-హైకోర్టు నిర్ణయానికి సమర్ధన..అదేం వ్యాపారం కాదంటూ..
ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. అంతకు ముందు ఏపీ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఎంబీబీఎస్ విద్యార్ధుల ట్యూషన్ ఫీజును 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడురెట్లు పెంచింది. 2017 నుంచి 2020 వరకూ వర్తించేలా దీన్ని పెంచింది. దీన్ని సవాల్ చేస్తూ విద్యార్ధులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయాన్ని నిలిపేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దిస్తూనే కీలక వ్యాఖ్యలు చేసింది.

విద్యారంగం వ్యాపారం కాదని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ట్యూషన్ ఫీజు అందరికీ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. గతం కంటే ఎంబీబీఎస్ విద్యార్ధుల ట్యూషన్ ఫీజు ఏడు రెట్లు పెంచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. రూ.24 లక్షలకు చేరిన ట్యూషన్ ఫీజుల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ సమర్ధించింది. దీంతో ట్యూషన్ ఫీజులపై ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications