Nara Bhuvanaeswari : భువనేశ్వరికి షాక్ ! చంద్రబాబు ములాఖత్ కు నిరాకరణ.. !
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఇవాళ రాజమండ్రి జైలు అధికారులు షాకిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఇప్పటివరకూ ములాఖత్ లకు అనుమతించిన అధికారులు ఇవాళ మాత్రం భువనేశ్వరికి నో చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల మేరకు వారానికి మూడుసార్లు చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ అవకాశం ఉంది. దీంతో ఆయనతో ములాఖత్ అయ్యేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్లు భువనేశ్వరి తెలిపారు. కానీ జైలు అధికారులు మాత్రం తన దరఖాస్తును తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. అయితే అధికారులు ములాఖత్ తిరస్కరణకు చెప్పిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.
చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైన తర్వాత రాజమండ్రి జైల్లోనే ఉంటున్నారు. దీంతో ఆయన భార్య భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రిలోనే ఉంటూ ఆయనకు భోజనం పంపిస్తున్నారు. మధ్యలో ములాఖత్ అవుతున్నారు. చంద్రబాబు రిమాండ్ పై జైలుకు వచ్చిన తర్వాత రోజు ఆయన్ను కుటుంబ సభ్యులు కలిశారు. ఆ తర్వాత లాయర్లు మధ్యలో కలిశారు. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి కలిశారు. దీంతో ఇవాళ మాత్రం ములాఖత్ కు అధికారులు అనుమతించ లేదు.
జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలను నిబంధనల ప్రకారం మూడుసార్లు కలిసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తమ దరఖాస్తు తిరస్కరించడంపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి రేపు ములాఖత్ కు దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జైలు అధికారులు ఏమంటారో చూడాలి.












Click it and Unblock the Notifications