బీహారీలు మోడీకి బుద్ధి చెప్పారు: రఘువీరా, 'గంటలో తారుమారు'
అనంతపురం: బీహార్ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆదివారం నాడు అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాట్నా ఎక్స్ప్రెస్లో వారు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు: ఆజాద్
మహా కూటమి గెలుస్తుందని, అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఉన్న ఆదరణ వల్లనే భారతీయ జనతా పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో అన్నారు.
బిజెపి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. నితీష్కు ఉన్న ఆదరణ వల్లనే బిజెపి ప్రధాని నరేంద్ర మోడీని రంగంలోకి దించిందని చెప్పారు. ఈ పోరులో నితీష్ కుమార్ గెలిచారని ఆజాద్ వ్యాఖ్యానించారు.
అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి: రామ్ మాధవ్
అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, అందుకే భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని బిజెపి అధికార ప్రతినిధి రామ్ మాధవ్ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలను పునసమీక్షించుకుంటామని ఆయన తెలిపారు. గంటలోనే జెడీయు తమ ఆధిక్యతను దాటివేశాయని చెప్పారు.