చంద్రబాబు, జగన్లపై కేసీఆర్కు అస్త్రాలు, ధీటుగా బీజేపీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలు రాజుకుంటున్నాయి. నిన్నటి వరకు పీపీఏలు, నీటి వివాదం, గవర్నర్కు అధికారులు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంటలు రేపాయి. ఇప్పుడు మొదటి నుండి ఉన్న పోలవరం రగడ.. ఇప్పుడు లోకసభలో ఆమోదం పొందడంతో మరింత వేడెక్కింది.
పోలవరం బిల్లుకు పార్లమెంటు దిగువ సభలో ఆమోదం లభించడంతో తెలంగాణ పార్టీలు, నాయకులు మండిపడుతున్నారు. టీజేఏసీ తెలంగాణ బందుకు పిలుపునిచ్చింది. విభజనకు ముందు తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకున్న కేసీఆర్.. విభజన తర్వాత కూడా దాని ద్వారానే రాజకీయ లబ్ధి పొందుతున్నారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.
విభజన తర్వాత పీపీఏలు, నీటి విడుదల అంశాలు తెరాసకు కలిసి వచ్చాయి. అవి తెలంగాణ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖమ్మంలో మినహా లేనందున, ఏపీలో అధికారంలో టీడీపీ ఉన్నందున.. ముఖ్యంగా టీటీడీపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందంటున్నారు.
ఇప్పుడు పోలవరం అంశం తెరాసకు దొరిగిన మరో ఆయుధం అంటున్నారు. పోలవరం బిల్లుకు లోకసభ ఆమోదం లభించడం పైన కేసీఆర్, తెరాస నేతలు మండిపడుతున్నారు. వారికి కాంగ్రెసు, సీపీఎం, సీపీఐ కూడా జత కల్సింది. టీజేఏసీ ఇచ్చిన బందుకు ఈ పార్టీలు అన్నీ మద్దతు పలికాయి.
ఇప్పుడు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు, బీజేపీ, టీడీపీలు మిగిలిపోయాయి. ఏపీలో అధికారంలో ఉన్నందున టీటీడీపీ నేతల పరిస్థితి మాట్లాడలేకుండా ఉందంటున్నారు. ఏపీలో ప్రతిపక్షమైనందున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన అంత ఇబ్బంది, ఒత్తిడి ఉండదని చెబుతున్నారు. అయితే, ఓ వైఖరి లేకుంటే ఆ పార్టీకి కొంత నష్టం తప్పదని అంటున్నారు.
ధీటుగా బీజేపీ
పీపీఏ, నీటీ విడుదల అంశాల పైన నిన్నటి వరకు చంద్రబాబు పైన మండిపడ్డ తెరాస, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు గవర్నర్కు ప్రత్యేక అధికారాలు, పోలవరం అంశం పైన చంద్రబాబుతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేశాయి. అయితే, తెరాసకు బీజేపీ ఘాటుగానే సమాధానమిస్తోంది. టీడీపీ కూడా దానికి జత కలిసింది. గవర్నర్కు ప్రత్యేక అధికారాలు, పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో కలిపే అంశం ఏపీ పునర్విభజన బిల్లులోనే ఉందని, ఇది యూపీఏ హయాంలోనే చేర్చారని, అప్పుడు కేసీఆర్ ఏం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు.