అన్నాడీఎంకే వైపు బీజేపీ, వెంకయ్య అడుగు!: పన్నీరు సెల్వంకు మోడీ హామీ
బీజేపీ, అన్నాడీఎంకేలు సిద్ధాంతపరంగా ఒక్కటేనని, తమిళనాడు ఎన్నికలలో పొత్తులకు కూడా అవకాశముందని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు చెప్పారు.
విజయవాడ/చెన్నై: బీజేపీ, అన్నాడీఎంకేలు సిద్ధాంతపరంగా ఒక్కటేనని, తమిళనాడు ఎన్నికలలో పొత్తులకు కూడా అవకాశముందని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు చెప్పారు. జయలలిత మృతితో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందనే చెప్పవచ్చు.
శశికళ పావులు: 'ఆర్కే నగర్' నుంచి పోటీ!
పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ బాధ్యతలు రేపో మాపో శశికళ చేతికి రానున్నాయి. అయితే, జయకు ఉన్న పబ్లిక్ ఇమేజ్ లేదా పట్టు వీరికి లేదు. దీంతో అన్నాడీఎంకేకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో బీజేపీ రంగంలోకి దిగింది. జయ మమృతి అనంతరం అన్నాడీఎంకే ద్వారా తమిళనాడులో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వెంకయ్య మాట్లాడారు.
పన్నీరు, శశికళలకు ఓదార్పు ద్వారా..
జయకు నివాళులు అర్పించే సమయంలో ప్రధాని మోడీ వద్దకు వచ్చిన శశికళ, పన్నీరు సెల్వంలు బోరుమన్నారు. ఈ సమయంలో మోడీ వారిని ఓదార్చారు. అన్నాడీఎంకే పైన ఇది కేంద్రం, ముఖ్యంగా బీజేపీ వైఖరికి ఇది నిదర్శనం అనే వాదనలు వినిపిస్తున్నాయి. వెంకయ్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
సిద్ధాంతపరంగా ఒకటిగా..
అన్నాడీఎంకే పార్టీకి, బీజేపీకి సిద్ధాంతపరంగా కొన్ని పోలికలు ఉన్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. తద్వారా బిజేపీ, అన్నాడీఎంకేలు కలిసేందుకు అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఉదయం నుంచి అక్కడే ఉన్న వెంకయ్య
జయ మృతి నేపథ్యంలో అందరూ విభ్రాంతికి గురైన సమయంలో, తాను మంగళవారం ఉదయం నుంచి అక్కడే ఉన్నానని వెంకయ్య చెప్పారు. జయలలిత అంత్యక్రియల కోసం స్థానికంగా గన్ క్యారేజీ లేదని, కోయంబత్తూరులో ఉందని, కానీ అక్కడి నుంచి చెన్నై వచ్చేందుకు ఆరు గంటలు పడుతుందని, మరొకటి హైదరాబాదులో ఉందని, ఇది మరీ దూరమని చెప్పారు. తాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి పారికర్తో మాట్లాడి ప్రత్యేక విమానంలో అరేంజ్ చేశామని చెప్పారు.
బీజేపీ-అన్నాడీఎంకే సంబంధాలపై
జయ మృతి నేపథ్యంలో తమిళనాడు పైన దృష్టి సారించడంపై వెంకయ్య మాట్లాడుతూ.. అన్నాడీఎంకేతో బీజేపీకి ఎప్పుడూ మంచి సంబంధాలనే ఉన్నాయని చెప్పారు.
సాయానికి సిద్ధమని పన్నీరుకు మోడీ
జయకు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రధాని మోడీ కూడా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు సూచనలు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి ఏ సాయం కావాలన్నా అడగాలని ముఖ్యమంత్రి పన్నీరుకు చెప్పారని తెలిపారు.
పొత్తు పెట్టుకోవాలనుకున్నా..
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకున్నట్లు వెంకయ్య చెప్పారు. తమ అభిప్రాయం పైన జయలలిత కూడా సానుకూలంగానే స్పందించారని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నారు. అయితే, జీఎస్టీ బిల్లుపై అన్నాడీఎంకే తమకు అనుకూలంగా ఓటు వేసిందని, బీజేపీకి ఆ పార్టీ దగ్గర అనేందుకు ఇది ఓ నిదర్శనం అంటున్నారు.