ఏపీ స్ధానిక పోరు సాక్షిగా చిగురిస్తున్న కొత్త స్నేహాలు.. వైసీపీ జోరుతో కలిసిపోతున్న పాత మిత్రులు ?
ఏపీ స్ధానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ దూకుడు ప్రధాన విపక్షమైన టీడీపీతో పాటు మిగతా విపక్షాలు జనసేన, బీజేపీ, సీపీఐలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 9 నెలలుగా వైసీపీ పాలన మీద అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష పార్టీలు.. తీరా ఎన్నికలు వచ్చే సరికి చేతులెత్తేస్తున్న పరిస్ధితి నెలకొంది. వైసీపీ ధాటికి ప్రధాన విపక్షమైన టీడీపీయే కుదేలయ్యే పరిస్ధితులు నెలకొనడంతో ఇక చేసేది లేక తాము కూడా టీడీపీకి మద్దతివ్వకపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిస్ధితులు ఉంటాయోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

స్ధానిక పోరులో విపక్షాల పరిస్ధితి
ఏపీలో స్ధానిక పోరులో అధికార వైసీపీ కనీవినీ ఎరగని రీతిలో విపక్షాలను కకావికలం చేస్తోంది. ఓవైపు దాడులు, మరోవైపు వలసలతో విపక్ష పార్టీల నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ స్ధానిక పోరును క్లీన్ స్వీప్ చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దీంతో విపక్ష పార్టీలైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, సీపీఐ కూడా పలుచోట్ల నామినేషన్లు సేతం వేయలేని స్ధితికి చేరుకున్నాయి. నామినేషన్లకే పరిస్దితి ఇలా ఉంటే ఇక ఎన్నికల్లో పోరాడేదెలా అని ఆయా పార్టీలు ఆలోచనలో పడిపోయాయి.

దగ్గరవుతున్న పాతమిత్రులు..
ఏపీ స్ధానిక పోరులో వైసీపీ దాడులు, ఒత్తిళ్లతో భయభ్రాంతులకు గురవుతున్న విపక్ష పార్టీలు ఉమ్మడిగా పనిచేస్తే కానీ అధికార పార్టీని ఎదుర్కోలేమనే అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. దీంతో జిల్లాల్లో పలు చోట్ల ఒకరికొకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. చాలా చోట్ల టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధులకు జనసేన, బీజేపీ, సీపీఐ మద్దతిస్తున్నాయి. అలాగే టీడీపీకి బలం లేని స్ధానాల్లో మిగతా విపక్ష పార్టీలకు స్నేహహస్తం అందిస్తోంది. దీంతో స్ధానిక పోరులో వైసీపీని కొన్నిచోట్లయినా ఎదుర్కొనేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి.

స్ధానిక పోరుకు ముందు...
స్ధానిక ఎన్నికల పోరుకు ముందు ఎవరికి వారు సత్తా చూపాలని భావించిన విపక్ష పార్టీలకు నోటిఫికేషన్ రాగానే నోటి మాటలు సైతం కరవవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ, టీడీపీ సహా ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండబోదని పదేపదే ప్రకటించిన బీజేపీ-జనసేన కూటమి తాజాగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. తమకు బలం లేని చోట్ల ఉన్న కొంత క్యాడర్ ను టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని పరోక్ష సంకేతాలు పంపుతోంది. అలాగే తమ అభ్యర్ధులు బలంగా ఉన్న అతికొద్ది స్ధానాల్లో మద్దతివ్వాలని టీడీపీని కోరుతోంది. దీంతో పలుచోట్ల విపక్షాల ఐక్యత కనిపిస్తోంది.

వైసీపీకి గట్టిపోటీ ఇస్తారా.. ?
స్ధానిక ఎన్నికల పోరులో భాగంగా ఒంటరిగా సత్తా చూపలేమని నిర్ణయానికి వచ్చేసిన విపక్ష పార్టీలు ఇప్పుడు ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నాయి. బయటికి చెప్పకున్నా పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలవుతున్న తీరు, ప్రచారం, ఇతర అంశాలను గమనిస్తే వీరి ఐక్యత తెలిసిపోతుంది. అయితే ఇన్ని చేసినా అధికార వైసీపికి గట్టి పోటీ ఇస్తారా అంటే అదీ అనుమానంగానే కనిపిస్తోంది. మూడు రాజధానులతో పాటు పలు కీలక సమస్యలపై వీరందరికీ ఉమ్మడి అజెండా లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో స్ధానిక పోరు ఎప్పుడు ముగిసిపోతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్ధితులు వీటిలో చాలా పార్టీలకు ఎదురవుతున్నాయి.












Click it and Unblock the Notifications