కాంప్రమైజ్ అవుతారో లేదో - పొత్తులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం పైన కొత్త రాజకీయం మొదలైంది. చంద్రబాబు, పవన్ ఇప్పటికే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. బీజేపీ పొత్తు పైన ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలోనే రెండు పార్టీల సీట్ల ఖరారు..ఎన్నికల సమాయత్తం పైన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ కేడర్ పని చేసుకుంటుందంటూ వ్యాఖ్యానించారు.
పొత్తు రాజకీయం : ఏపీలో 2014 తరహాలో రాజకీయంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ, జనసేన కోరుకుంటున్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందనే అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చల తరువాత పొత్తు ఖాయమని అందరూ భావించారు. సీట్ల గురించి చర్చలు చేసినట్లు ప్రచారం సాగింది. సమయం గడుస్తున్న బీజేపీ నుంచి పొత్తు పైన ఎలాంటి స్పష్టత రావటం లేదు. దీంతో, టీడీపీ - జనసేన పోటీ చేసే 99 మంది అభ్యర్దులను ఇరు పార్టీలు ప్రకటించాయి. బీజేపీ కలిసి వస్తే పెండింగ్ సీట్లలో కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. బీజేపీ కలిసి రాకపోతే జనసేన సీట్లు పెరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

పురందేశ్వరి వ్యాఖ్యలు : ఇటు టీడీపీ - జనసేన ఎన్నికల సభ ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో నిర్వహణకు నిర్ణయంచారు. దీనికి ఒక రోజు ముందు ఏలూరు కేంద్రంగా బీజేపీ ఎన్నికల సభకు నిర్ణయించింది. ఈ సభకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరు కానున్నారు. దీంతో..అసలు పొత్తు ఉంటుందా లేదా అనేది రాజకీయంగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు రెండు పార్టీలు సీట్లు ప్రకటించటంతో ఈ అనుమానం మరింత బలపడింది. ఈ సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. రెండు పార్టీలు 99 సీట్లు ప్రకటించినా..ఇంకా సీట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొనే పనిలో ఉన్నామని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు తమ వ్యూహం తమకు ఉందని వెల్లడించారు.

సీట్ల ప్రకటనతో : సీట్ల విషయంలో కాంప్రమైజ్ అవుతారా లేదా.. పొత్తు ఉంటుందా.. సీట్ల సంగతి ఏంటనేది బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ హైకమాండ్ చర్చలు పూర్తి చేసి సీట్లు ప్రకటించిన తరువాతనే పొత్తు పైన తాము స్పందిస్తామన్నారు. 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ నేతలు పని చేసుకుంటున్నారని చెప్పారు. అటు పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో చర్చలు చేసేందుకు వారి నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా బీజేపీ నుంచి స్పష్టత వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అప్పటికీ రాకుంటే ఏపీలో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications