సాయిరెడ్డికి కౌంటర్ పడిందిగా: దేశ నిర్మాణమే మా పని: అదే అర్హత: పురంధేశ్వరికి ఫుల్ సపోర్ట్
అమరావతి: భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకాన్ని తప్పు పడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విజయసాయి రెడ్డి చేసిన ఈ కామెంట్ల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సాయిరెడ్డిపై ప్రతిదాడులను చేస్తున్నారు. కులం పేరును ప్రస్తావించడంలో అర్థం లేదని, పురంధేశ్వరి ఒక జాతీయ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా నియమితులు అయ్యారనే విషయాన్ని విస్మరించ కూడదని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కులం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సి ఉంటుందని బీజేపీ ఉపాధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ఇచ్చిన ప్రకటన ఈ వివాదానికి కారణమైంది. అమరావతి ప్రాంత రైతులు వేలాది ఎకరాలను రాజధాని నిర్మాణానికి ధారదాత్తం చేశారని, ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి, మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తమ పార్టీకి రెండు నాల్కల ధోరణి లేదనీ స్పష్టం చేశారు. జగన్ సర్కార్ పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, దీనికి హైకోర్టు ఇచ్చే తీర్పులే నిదర్శనమని అన్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి వ్యాఖ్యలను తప్పు పట్టారు. జాతీయ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించట్లేదని సాయిరెడ్డి విమర్శించారు. ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు.. జాతి నాయకురాలు అనే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమది జాతీయ పార్టీ అనే విషయాన్ని సాయిరెడ్డి విస్మరిస్తున్నారని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ తమది అని అన్నారు.
Recommended Video
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేయడం సరికాదని సునీల్ దియోధర్ అన్నారు. ఆమెకు ఉన్న అర్హత చూసి పురంధేశ్వరిని పార్టీ అధిష్ఠానం జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. ఆమెకు ఉన్న అర్హతలు, బాధ్యతలను కులంతో ముడిపెట్టి చూస్తారా? అని మండిపడ్డారు. అన్నింటినీ కులాల దృష్టిలో చూడటం, ప్రతి అంశాన్నీ కులమయం చేయడం వైఎస్ఆర్సీపీ నైజమని ఎదురుదాడి చేశారు. అలాంటి వైఎస్ఆర్సీపీ కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందని సునీల్ దియోధర్ ఎద్దేవా చేశారు.