చంద్రబాబుకు బీజేపీ అనూహ్య ట్విస్ట్ : ట్వీట్ - డిలేట్: లోకేష్ లక్ష్యంగా..!!
ఏపీలో ఒక వైపు టీడీపీ - బీజేపీ మధ్య పొత్తు పైన ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా 2014 సమయంలో తరహాలోనే ఇప్పుడు పొత్తులు ఖరారవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. దీని పైన బీజేపీ ముఖ్య నేతలు ఖండించారు. ఏపీలో జనసేనతో మినహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఖరా ఖండిగా చెబుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరైతే పొత్తుల గురించి మాట్లాడుతున్నారో..వారే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో బీజేపీ నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ పోస్టింగ్ రాజకీయ చర్చకు కారణమైంది. అయితే, దీని పైన చర్చ సాగుతున్న సమయంలో ఈ ట్వీట్ డిలేట్ చేయటం మరింత ఇంట్రిస్టింగ్ గా మారింది.
ట్విట్టర్ లో బీజేపీ పోస్టింగ్ తో
చంద్రబాబు తాను పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదని.. పార్టీ నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇప్పుడు ఇదే సమయంలో ఏపీ బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టింగ్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం సింగిల్ వర్డ్ పోస్టింగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి అనేక మంది ప్రముఖులు సింగిల్ వర్డ్ తో ట్విట్టర్ లో పోస్టింగ్ లు చేస్తున్నారు. అందులో భాగంగా...టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ఖాతాలో "తెలుగు" అనే పదం పోస్టు చేసారు. అదే విధంగా టీడీపీ నేత..ఎమ్మెల్సీ నారా లోకేష్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో "కార్యకర్త" అంటూ పోస్టు చేసారు.
లోకేష్ ను టార్గెట్ చేస్తూ..
వీటి పైన ఏపీ బీజేపీ విభాగం స్పందించింది. ఏపీ బీజేపీ విభాగం అఫీషియల్ ట్విట్టర్ లో ఒక పోస్టు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. అందులో.. "'జెల్లి' చుట్టు తిరగడం మానేసి 'ప్రమాదపుశాతం' రాజకీయాల్లోకి వచ్చిన మీ అబ్బాయికి 'సొచ్చనంగా' తెలుగు నేర్పించుకోండి బాబు జీ లేకపోతే ప్రజలు మీ 'జోదెద్దుల' బండిని 'అభినిందిం'చరు.." అంటూ చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ చేసిన ట్వీట్లలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదు. కానీ, బీజేపీ ఇప్పుడు ఇలా చంద్రబాబు ట్వీట్ కు సమాధానంగా లోకేష్ ను విమర్శిస్తూ ట్వీట్ చేయటం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. అయితే, ఆ ట్వీట్ ను ఆ తరువాత డిలీట్ చేసారు. ఇప్పుడు ట్వీట్ చేయటం.. డిలీట్ చేయటం రాజకీయంగా ఇంట్రస్టింగ్ డిబేట్ గా మారుతోంది.
బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే చేసిందా
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్.. ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు... బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత లక్ష్మణ్ ఇప్పటికే టీడీపీతో పొత్తు అవకాశం లేదని స్పష్టం చేసారు. ఈ సమయంలో..బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టింగ్ రావటం ఆసక్తి కరంగా మారింది. అయితే, అటు జనసేన - ఇటు బీజేపీ పైన టీడీపీ చాలా కాలంగా రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేయటం లేదు.
అవకాశం వచ్చిన సమయంలో..చంద్రబాబు ప్రధాని మోదీ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. తాజాగా.. ఢిల్లీలో ప్రధాని మోదీ - చంద్రబాబు పలకరింపుల తరువాత ఈ పొత్తు రాజకీయాల పైన ఊహాగానాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక, ఇప్పుడు బీజేపీ చేసిన ఈ ట్వీట్ పైన టీడీపీ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.