ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు - ఢిల్లీ బీజేపీ లెక్క పక్కా..!!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు. సీఎం జగన్ వై నాటు 175 అని ధీమాగా చెబుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు మాదే అంటున్నారు. ఇక, ఒక్క ఛాన్స్ అంటూ పవన్ ప్రజల ముందుకు వస్తున్నారు. బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. అయితే, ఈ ఫలితం ఈ సారి పొత్తులే డిసైడ్ చేస్తాయనేది సుస్పష్టం. జనసేన -బీజేపీతో కలిసి వెళ్లాలనేది టీడీపీ ఆలోచన. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. రెండు పార్టీల మధ్య పవన్ కల్యాన్ ఎవరితో ఉండాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతల అంచనాలు ఏంటనేది స్పష్టం అవుతోంది.

టీడీపీ స్థానం తమదే అంటున్న బీజేపీ
ఏపీలో ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారానికి ఢోకా లేదనేది సీఎం జగన్ అంచనా. అదే పార్టీ నేతలతో ఓపెన్ గానే చెబుతున్నారు. ఈ సారి గెలిస్తే సరి..గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలనేది చంద్రబాబు చెబుతున్న విషయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పిన పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ తరువాత..కొంత అసౌకర్యంగా కనిపిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఆ తరువాత ప్రధాని మోదీని ఓడించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ తో జత కట్టారు. అదే విధంగా ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతీ సందర్భంలోనూ అప్పటికి కొన్ని సీట్లు మినహా..క్షేత్ర స్థాయిలో బలోపేతం కాలేదనేది కమలం పార్టీ నేతల వాదన. తాజాగా ప్రధాని విశాఖ పర్యటన సమయంలోనే మన పార్టీ మనకు ముఖ్యమని ఏపీ బీజేపీ కోర్ నేతలకు తేల్చి చెప్పారు. జనసేనానితో సమావేశం సమయంలోనూ రెండు పార్టీల మధ్య మైత్రి గురించే ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

పవన్ సహకరిస్తారనే ధీమాలో కమలం నేతలు
టీడీపీతో జత కట్టేందుకు ప్రధాని సిద్దంగా లేరనే విషయం జనసేనానికి ఆ నిమిషంలోనే అర్దమైందని చెబుతున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యం. టీడీపీతో కలవకూడదనేది బీజేపీ నిర్ణయం. ఇదే సమయంలో బీజేపీ నేతల అసలు వ్యూహం ఏంటనే దాని పైన స్పష్టత వస్తోంది. టీడీపీ - జనసేన కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఉంటుందని, కూటమి కట్టకపోతే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే అంచనాలతో బీజేపీ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బీజేపీ ఏపీలో అసలు టార్గెట్ 2029 గా చెబుతున్నారు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింతగా బలపడి..తమ స్పేస్ తగ్గుతుందని ఆ పార్టీ నేతల అంచనా. దీంతో, ఈ సారి వైసీపీ గెలిచినా..పవన్ సహకారంతో 2029 ఎన్నికల నాటికి బీజేపీ - జనసేన కూటమి టీడీపీ స్థానంలో నిలుస్తుందనే విశ్లేషణలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తేనే..తమకు ఛాన్స్ అంటూ..
చంద్రబాబు కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే, బీజేపీ తమతో కలవకపోయినా..కేంద్రంలో అధికారంలో ఉండి జగన్ కు మద్దతివ్వకపోతే చాలని టీడీపీ ముఖ్య నేతలు కోరుకుంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఓటములే తమ పార్టీ బలోపేతం పైన ప్రభావం చూపిస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు తమ మిత్రుడుగా ఉన్న పవన్ ను కూడా చంద్రబాబుతో కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, జగన్ ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న పవన్ చివరకు టీడీపీతోనే కలుస్తారనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో అంత సులువుగా బీజేపీ ముఖ్య నేతలతో సంబంధాలు వదులుకోవటానికి పవన్ సిద్దంగా లేరని చెబుతున్నారు. అటు వైసీపీ మాత్ర ఏ పార్టీలు కలిసి వచ్చినా..తాము మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తామంటూ చెప్పుకొస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications