"మెగా" బ్రదర్స్ ను వీడనంటున్న బీజేపీ - ఢిల్లీ కేంద్రంగా మరోసారి..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మెగా బ్రదర్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ తో పొత్తు కోసం టీడీపీ వెయిట్ చేస్తోంది. తమతోనే పవన్ ఉంటారని బీజేపీ చెబుతోంది. పవన్ అత్యున్నత స్థానం అందుకుంటారంటూ అన్నయ్య చిరంజీవి ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కోసం ఢిల్లీ బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ...తమకు ఓట్లు తెచ్చిపెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా మరోసారి కీలక అడుగులు పడుతున్నాయి.

మెగా బ్రదర్స్ మాస్ ఫాలోయింగ్ కలిసి వస్తుందని
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ..2019లో ఒంటరిగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసింది. ఆ ఎన్నికల తరువా మెగా బ్రదర్స్ పైన ఫోకస్ పెట్టింది. టీడీపీతో వద్దని డిసైడ్ అయిన బీజేపీ ఢిల్లీ పెద్దలు.. అమెరికా వేదికగా జనసేనానితో చర్చలు ప్రారంభించారు. ఆ తరువాత అమరావతి వేదికగా పొత్తు ఖరారు చేసుకున్నారు. ఏపీలో ఆ సమయంలో కన్నాలక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరువాత నియమితులైన సోము వీర్రాజు తన నియామకం ఖరారు కాగానే తొలుత కలిసింది మెగాస్టార్ చిరంజీవినే. బీజేపీలో ఆహ్వానించారు. సున్నితంగా తిరస్కరించిన చిరంజీవి.. పవన్ తో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. బీజేపీ -జనసేన మూడున్నారేళ్లుగా రెండు పార్టీలు కలిసే ఉన్నా.. ఐక్య పోరాటాలు.. సభలు ..సమావేశాలు మాత్రం లేవు. ఇక, ఇప్పుడు ఏపీ - తెలంగాణలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల మూడ్ వచ్చేసింది. తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యాక్టర్ పై బీజేపీ నమ్మకం
దీంతో..సినీ హీరోలతో పాటుగా సెలబ్రెటీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా ఓట్ బ్యాంక్ ఆకర్షించే ఎత్తుగడ లను అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో పవన్ తో పొత్తు కొనసాగిస్తూనే...కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాజకీయాలే చర్చించారని బీజేపీ నేతలు స్పష్టం చేసారు. ఇక, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీజేపీ -జనసేన మధ్య పొత్తు డైలమాలో పడింది. ప్రధాని ఏపీ పర్యటన ఖరారైంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. విశాఖలో ప్రధానితో పవన్ సమావేశమయ్యారు. పవన్ తమతోనే ఉంటారంటూ బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఆ తరువాత పవన్ వరుసగా ప్రధానిని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్లు కూడా అదే సంకేతాలు ఇచ్చాయి. ఇక, టీడీపీ తో పవన్ పొత్తు పై డైలమా కొనసాగుతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు చిరంజీవిని ఎంపిక అయ్యారు.

నో అంటున్న చిరంజీవితో ఎస్ అనిపిస్తారా
అంతే ఒకేసారి కేంద్రం మంత్రులతో సహా.. ప్రధాని మోదీ సైతం ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేసారు. అందులో చిరంజీవి వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. అయితే, ఇది సాధారణ అభినందనగా తీసుకొనే అవకాశం కనిపించటం లేదు. కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా పవన్ కు ఆహ్వానం..ఇప్పుడు అన్నయ్య కు పురస్కారం వెనుక బీజేపీ మెగా బ్రదర్స్ ను దగ్గర చేసుకొనేందుకు ఏ స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోందో స్పష్టం అవుతోందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మెగా బ్రదర్స్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. తమకు రాజకీయంగా కలిసి వస్తుందనేది బీజేపీ లెక్క. కానీ, మెగాస్టార్ చిరంజీవికి గతంలోనే ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఆఫర్ ఇచ్చినా తిరస్కరించారు. రాజకీయాలు తనకు ఇక వద్దని తేల్చి చెప్పారు. రాజకీయంగా ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయరనే గుర్తింపు ఉన్న బీజేపీ ముఖ్య నేతల వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో.. మెగా బ్రదర్స్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications